ప్రజలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డ పాక్: ఇద్దరు జవాన్లు, ముగ్గురు పౌరుల మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ సైన్యం జమ్మూకాశ్మీర్లోని సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు కాల్పులు తెగబడింది. కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ రేంజర్లు సరిహద్దుల్లో పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు.
జమ్మూ, పూంఛ్ జిల్లాల్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్ఎస్ పుర ప్రాంతంలో పాక్ రాత్రంతా భారీ ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉందని బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు.
బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ కాల్పులను తిప్పి కొడుతున్నారని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం అధికంగా కలిగించాలనే ఉద్దేశంతో పాక్ రేంజర్లు గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.
అర్నియా, రామ్గఢ్, సాంబా, హీరానగర్ సెక్టార్లలో శనివారం ఉదయం 5 గంటల వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. అఖ్నూర్ ప్రాంతంలో ఇద్దరు గాయపడ్డారని, ఓ బాలికకు కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో సుమారు 9వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మరో వెయ్యి మందికి ఆర్ఎస్ పురలో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.