పుల్వామాలో ఎన్కౌంటర్: జవాను మృతి, ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
పుల్లామా జిల్లాలోని అగ్లర్ కండి ప్రాంతంలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు కూడా గాయపడినట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దగ్గర రెండు ఏకే-47, ఒక తుపాకీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు మృతి చెందారు.
కాగా, ఈ ఎన్కౌంటర్లో హతమైన వారిలో ఒకరిని జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ మేనేల్లుడిగా గుర్తించారు. మృతిచెందిన జైషే నేతను తల్హ రషీద్గా గుర్తించారు. పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థకు అతను స్థానిక కమాండర్గా పనిచేస్తున్నాడు. ఇదే ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అందులో డివిజనల్ కమాండర్ మొహమ్మద్ భాయ్, మరో స్థానికుడు వాసీమ్ కూడా ఉన్నారు.