అలా కుదరదు... పట్టుపట్టొద్దు: కెసిఆర్ ఇంటికి జైరామ్
న్యూఢిల్లీ: మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు, కేంద్రమంత్రి జైరామ్ రమేష్ శనివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా) సవరణలపై చర్చించారు. గంటపాటు ఆయనతో చర్చ జరిపారు. ఈ సమయంలో సవరణల పైన పట్టు పట్టవద్దని కెసిఆర్ను జైరామ్ కోరారు. ఉద్యోగులు, పింఛనుదారుల పంపిణీ స్థానికత ఆధారంగా జరగాలని కెసిఆర్ కోరారు.
దీనిపై జైరామ్ స్పందిస్తూ.. గతంలో రాష్ట్రాల విభజన సందర్భంగా జనాభా ప్రాతిపదికన ఉద్యోగులు, పింఛనుదారులను కేటాయించామని, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తామని, సవరణ కోసం పట్టు పట్టవద్దని కోరారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందున దానికి బదులు ఇచ్చిన ఎపి భవన్ను తెలంగాణకు ఇవ్వాలని కెసిఆర్ కోరారు. ఇది కూడా కుదరదని, ప్రత్యామ్నాయాలు చూపిస్తామని జైరామ్ చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకు లోక్సభలో 18న లేదా 19న ఆమోదం లభిస్తుందని చెప్పారని సమాచారం. వివిధ డిమాండ్లపై పట్టుబడితే ఇబ్బందులు తలెత్తుతాయని, ముందుగా బిల్లు ఆమోదింప చేసుకోవడం ముఖ్యమని కెసిఆర్కు జైరామ్ రమేష్ సూచించారు.
ఇందుకు కెసిఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, సోమవారం నుంచి సభలో సమన్వయంపైనా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. సభా సమన్వయం కోసం స్పీకర్ సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కూడా జైరాం రమేశ్ చెప్పారు.












Click it and Unblock the Notifications