ఎపికి ప్రత్యేక హోదా అనుమానమే: జైరాం రమేష్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదని కేంద్ర మాజీ మంత్రి, విభజనపై జీవోఎం సభ్యుడుగా ఉన్న జైరాం రమేశ్ ఆరోపించారు. ప్రణాళికా సంఘం అధికారులకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదని, అందువల్లే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు అనవసర కష్టాలు కల్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రణాళికా మంత్రి ఇంద్రజిత్కు ఓ లేఖ రాశారు. జైరాం రమేష్ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వార్తాకథనాన్ని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించింది.
ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో తాను గత జూలై 18న లేవనెత్తిన ప్రత్యేక ప్రస్తావనపై మంత్రి రాసిన లేఖకు జైరాం స్పందించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) ప్రస్తావన తీసుకురావడం పట్ల జైరాం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా? మీ ఉత్తరం చూస్తుంటే ప్రత్యేక హోదా కల్పించే ఉద్దేశం లేనట్లు కనపడుతోందని ఆయన అన్నారు.
జైరాం రమేశ్ జూలై 18న రాజ్యసభలో చేసిన ప్రత్యేక ప్రస్తావనకు స్పందిస్తూ ప్రణాళికా మంత్రి ఇంద్రజిత్ ఆగస్టు 11న రాసిన లేఖలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాజీ ప్రధాని ఈ ఏడాది ఫిబ్రవరిలో హామీ ఇచ్చిన విషయాన్ని అంగీకరించారు. అయితే, కొన్ని రాష్ట్రాలకు ప్రణాళికా సహాయం కోసం ప్రత్యేక హోదాను గతంలో ఎన్డీసీ కల్పించిన విషయాన్ని కూడా ఇంద్రజిత్ గుర్తు చేశారు.
ప్రత్యేక పరిశీలన అవసరమయ్యే పలు లక్షణాలు ఉన్న రాష్ట్రాల విషయంలోనే ఎన్డీసీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగరీ హోదా కల్పించేందుకు ఏయే అంశాలు, పద్ధతులను పరిశీలించాలో ప్రణాళికా సంఘం ప్రస్తుతం యోచిస్తోందని చెప్పారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46(2), 46(3) క్రింద ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కల్పించే విషయంలో సన్నాహక చర్యలు తీసుకునేందుకు ప్రణాళికా సంఘంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పర్చినట్లు ఇంద్రజిత్ చెప్పారు.
అయితే, ఈ లేఖపై జైరాం వెంటనే విరుచుకుపడ్డారు. ప్రణాళికా మంత్రి లేఖ తనను ఆశ్చర్యంలో ముంచిందంటూ తన జవాబును సంధించారు. 2000లో ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత 2002లో కేంద్ర మంత్రివర్గం దానికి ప్రత్యేక హోదా కల్పించిందని, ఆ తర్వాతే ఎన్డీసీ ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని జైరాం రమేశ్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా 2014 మార్చి1న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రత్యేకహోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేందుకు ఏయే అంశాలు, పద్ధతులను పరిశీలించాలో ప్రణాళికా సంఘం యోచిస్తోందన్న ప్రణాళికా మంత్రి ప్రకటన తనకు అర్థం కాలేదని జైరాం చెప్పారు.