మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..!!
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల వేడి క్రమంగా పుంజుకుంటోంది. ఇక జమ్మూలో ప్రధాన పార్టీ నేతలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు పర్యటించగా... తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే జమ్మూ కాశ్మీర్ ప్రజలపై వరాలు కురిపించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా గ్యారెంటీ పథకాలతో హామీలు ఇస్తూ వెళుతోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తాము అధికారంలోకి వస్తే ఎలాంటి వరాలు ప్రజలకు ఇస్తారో చెప్పారు.

జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పొత్తుతో బరిలో దిగనున్నాయి. ఇక తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలను ఇస్తామని హర్గే హామీ ఇచ్చారు. దీంతో పాటు మరో ఐదు హామీలను కూడా ఖర్గే ఇచ్చారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయితే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 11 కిలోల ఆహార ధాన్యాలు అందించే కార్యక్రమం పునరుద్దరిస్తామని తెలిపారు. కుటుంబాన్ని ముందుండి నడిపించే గృహిణులకు నెలకు రూ.3000 ఇస్తామని వెల్లడించారు.మన్మోహన్ సింగ్ హయాంలో హామీ ఇచ్చినట్లుగా వలస వచ్చిన కాశ్మీరీ పండిట్లకు పునరావాసం ఏర్పాటు నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ఇక ఓబీసీ కేటగిరీకి రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను కల్పిస్తామని చెప్పిన ఖర్గే... జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా,ఉభయసభలను పునరుద్దరించేందుకు పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఇక మోదీ ప్రభుత్వంపై ఖర్గే విమర్శల ఎక్కుపెట్టారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.జమ్మూ కాశ్మీర్ ప్రజలను పేదరికంలోనే మగ్గేలా వ్యవహరిస్తోందని విమర్శించిన ఖర్గే...హోంమంత్రి అమిత్ షా అబద్ధాల మీద అబద్దాలు చెబుతున్నారన్నారు. మోదీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి పదేళ్లు గడిచిందని గుర్తు చేసిన ఆయన, జమ్మూ కాశ్మీర్లో లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వలేని వారు ఐదు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్డీయే సర్కార్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పై దృష్టి సారించలేదని చెప్పిన ఖర్గే.. ఒక్క పరిశ్రమను కూడా స్థాపించలేదని గుర్తు చేశారు. అందువల్ల ఉపాధి లేదని వెల్లడించారు.సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పర్యాటకం, తయారీ రంగాలపై దృష్టి సారిస్తామని చెప్పిన ఖర్గే... గత కొన్నేళ్లలో 4వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు.వాటిని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications