రాజౌరి ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు: ఇద్దరు పౌరులు, మరొకరికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రాజౌరి మిలిటరీ క్యాంప్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. అయితే, కాల్పులు జరిపింది ఆర్మీ సెంట్రీనే అని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.
వీధుల్లోకి వచ్చి ఆల్ఫా గేట్ ఆర్మీ క్యాంపుపై రాళ్లు రువ్వారు. పెద్ద ఎత్తున ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూ-పూంఛ్ నేషనల్ హైవేను అడ్డగించి ఆందోళన చేశారు. దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

శుక్రవారం ఉదయం 6.15 గంటలకు స్థానికులు పని కోసం ఆర్మీ గేట్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో కాల్పులు జరపడంతో ఇద్దరు స్థానికులు చనిపోయారని చెబుతున్నారు. కొందరు ఆర్మీ అధికారులు నిర్లక్ష్యంగా ఇలా తరచూ కాల్పులు జరిపి స్థానికుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడుతున్నారు.
కాగా, కాల్పుల్లో మరణించిన వారిని కమల్ కుమార్, సురీందర్ కుమార్గా గుర్తించారు. వీరిద్దరూ కూడా రాజౌరీకి చెందినవారే. ఈ కాల్పుల్లో గాయపడిన అనిల్ కుమార్.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవ్యక్తి. ప్రస్తుతం ఇతనికి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఆర్మీ అధికారులు స్థానికుల వాదనను కొట్టిపారేశారు. ఆర్మీ క్యాంపు వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. ఈ కాల్పుల్లోనే ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు వెల్లడించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications