కాశ్మీర్ భారత్దే: తగ్గిన కవిత, బల్లలు చర్చిన బీజేపీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం.. జమ్మ కాశ్మీర్ భారత దేశంలో అంతర్గత భాగమని చెప్పారు. కవిత సోమవారం లోకసభలో కాశ్మీర్ పండితుల పునరావాసంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై మాట్లాడారు. ఆమె ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమ్మ కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత దేశంలో కలిపారని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు జమ్ముకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ప్రకటించారు. తద్వారా ఆమె తగ్గారు. కాశ్మీర్ పండితుల పునరావాసంపై కవిత వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధికారపక్షం సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యుల సైతం ప్రశంసించారు. మనం గాజా కాందీశీకులు, ఇరాక్ కాందిశీకుల గురించి మాట్లాడుతామని, కానీ సొంత దేశంలో కాందిశీకులుగా బతుకు వెళ్లదీస్తున్న కాశ్మీర్ పండితుల గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో బిజెపి సభ్యులతోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులూ బల్లలు చరుస్తూ కవితకు మద్దతు ప్రకటించారు. మాజీ ఉప ప్రధాని అద్వానీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, బిజెడి సీనియర్ నాయకుడు భర్తుహరి మహతాబ్తోపాటు పలువురు సీనియర్, జూనియర్ సభ్యులు తెరాస ఎంపీ ప్రసంగాన్ని ప్రశంసించారు. కాశ్మీర్ కాందీశీకులు గత 25 ఏళ్లు నుంచి ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వలస జీవితాన్ని జీవించవలసి వస్తోందన్నారు.
కాశ్మీర్ పండితులు జమ్ము కాశ్మీర్కు వెళ్లిపోయి స్థిరపడాలని ప్రభుత్వం కోరుతోంది కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా అక్కడికి వెళ్లి ఉండగలరా? అని కవిత ప్రశ్నించారు. రికార్డు కోసం వారిని అక్కడికి పంపించే ప్రయత్నం చేయవద్దని, వారికి పూర్తి భద్రత కల్పించిన తరువాతనే వారిని జమ్ముకాశ్మీర్కు పంపించాలన్నారు.
కాశ్మీర్ పండితులపై ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన కొన్ని దాడులను ప్రస్తావిస్తూ ఈ కేసుల దర్యాప్తును ఇప్పటికీ పూర్తి చేయకపోవటం సిగ్గు చేటన్నారు. కాశ్మీర్ పండితులు తిరిగి తమ స్వరాష్ట్రానికి వెళ్లి భద్రంగా జీవించేందుకు ఎన్డిఏ ప్రభుత్వం ఒక బ్లూప్రింట్ను తయారు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాగా, కవిత ప్రసంగంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ పండిట్లను స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications