రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు: ఒక్క జనవరిలోనే రూ.1.2 లక్షల కోట్లు, మరికొన్ని గంటల్లో బడ్జెట్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు భారీగా క్షీణించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) జనవరి 2021లో అంచనాలను మించి పుంజుకుంది. జనవరి నెలకు గానూ అత్యధికంగా సుమారు 1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతేగాక, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో వసూలవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
జనవరి 31 సాయంత్రం 6 గంటల వరకు మొత్తం జీఎస్టీ రూ.1.19,847 కోట్లు వసూలైటన్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ కింద రూ. 21,923 కోట్లు వసూలు కాగా, ఎస్ జీఎస్టీ కింద రూ. 29,014 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 60,288 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

సెస్సుల రూపంలో రూ.8622 కోట్లు సమకూరినట్లు వెల్లడించింది. డిసెంబర్ నెలకు సంబంధించి జనవరి 31 వరకు 90 లక్షల జీఎస్టీఆర్-2బీ రిటర్నులు దాఖలైనట్లు పేర్కొంది. ఇప్పటి వరకు డిసెంబర్ నెలలో వసూలైన రూ. 1.15 లక్షల కోట్లే రికార్డు.
కాగా, ఆ రికార్డును జనవరి నెల వసూళ్లు చెరిపేశాయి. ఇది ఇలావుంటే, గత జనవరిలో పోలిస్తే 8 శాతం అధికంగా జీఎస్టీ వసూలైంది. 2020 జనవరి నెలలో 1.11 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలైంది.
Recommended Video
మరోవైపు ఫిబ్రవరి 1, 2021న అంటే సోమవారం రోజున కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేటాయింపులు ఏయే రంగానికి ఏయే విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications