జయలలితను సింగపూర్ తరలిస్తారా?: '2వారాల్లో పాలనా పగ్గాలు'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సింగపూర్ వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆమెకు లండన్ నుంచి వచ్చిన డాక్టర్ చికిత్స చేస్తున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం సింగపూర్ నుంచి వచ్చిన వైద్యులు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారని తెలుస్తోందిత. అలాగే జయలలితను సింగపూర్ తరలించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అపోలో ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ అధినేత్రి కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రి వద్దే పూజలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తోన్న విషయం తెలిసిందే.
జయలలిత అనారోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్న ఆపార్టీ కార్యకర్తలు ఆడటబం సింగపూర్ తరలిస్తారని వెలువడ్డ వార్తలతో మరింతో ఆందోళన చెందుతున్నారు. కాగా, ఆమెకు సింగపూర్కు తరలిస్తారని పదిరోజుల క్రితం కూడా వార్తలు వచ్చాయి. కానీ అపోలోలోనే చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా జయలలిత ఆరోగ్యం కుదుట పడుతోందని చెబుతున్నారు. ఆమె మరో రెండు వారాల్లో పూర్తిగా కొలుకొని పాలనా పగ్గాలు కూడా చేపడతారని చాలామంది భావిస్తున్నారు. త్వరలో కోలుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.