నేడే తీర్పు: తీవ్ర ఉత్కంఠ, జయలలితకు గృహ నిర్బంధం?
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవిష్యత్తు సోమవారం తేలిపోతుంది. కర్ణాటక హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో భద్రతను పెంచారు.
ఈ కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నిరుడు సెప్టెంబర్ 27న ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది. అలాగే సహనిందితులైన శశికళ, ఆమె మేనకోడలు ఇళవరసి, మేనల్లుడు సుధాకరన్ (జయ మాజీ దత్తపుత్రుడు)లకూ నాలుగేళ్ల శిక్ష, తలా రూ.10కోట్ల జరిమానా వేసింది. ఈ తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
దీంతో వీరి అప్పీల్పై మూడు నెలల్లో విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వాలని కర్ణాటక హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ మేరకు తీర్పు గత నెలలోనే వెలువడుతుందని అందరూ భావించిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్పు వంటి వివాదాలవల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు శిక్షను ఖరారు చేస్తే జయలలిత జైలుకు వెళ్లడమేగాక ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు.
తీర్పు సమయంలో జయలలిత హాజరు కావాల్సిన అవసరం లేనందువల్ల ఆమె రాకపోతే, శిక్ష ఖరారైన పక్షంలో జైలు కు తరలించాల్సి ఉన్నందున చెన్నైలో గృహ నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడునుంచి జయ మద్దతు దారులు పెద్ద సంఖ్యలో రావచ్చని భావిస్తున్న కర్ణాటక పోలీసులు సోమవారం ఉదయం ఆరు నుంచి సాయం త్రంవరకూ హైకోర్టుకు కిలోమీటర్ పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు.
మరో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నందున హైకోర్టు తీర్పుపై జయలలితతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు.