జయ డిశ్చార్జికి సన్నాహాలు: ఊరేగింపులో విషాదం
చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్న నేపధ్యంలో ఆమెను డిశ్చార్జీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. జయలలిత దాదాపు కోలుకున్నారని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.
అపోలో, ఎయిమ్స్, లండన్, సింగపూర్ వైద్యులు అందించిన చికిత్సతో అమ్మ పూర్తిగా కోలుకున్నారని, ఆమె స్వయంగా ఆహారం తీసుకుంటున్నారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. చికిత్స చేస్తున్న వైద్యులతో జయలలిత సంభాషిస్తున్నారని అన్నారు.
లండన్ నుంచి వచ్చిన వైద్యుడు డాక్టర్ రిచర్డ్ మంగళవారం జయలలితకు చికిత్స చేస్తున్న తీరును పర్యవేక్షించారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్న తీరుతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.
దీపావళి పండుగలోగా అమ్మ ఇంటికి చేరుకోవాలని, అందరూ సంతోషంగా పండుగ చేసుకోవాలని అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు.
ఈనెల 27 లోపు అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ఈ విషయంపై ప్రకటన విడుదల చేస్తారని అన్నాడీఎంకే కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు తమిళనాడుకు చెందిన వివిధ మంత్రులు అపోలో ఆసుపత్రి చేరుకుని జయలలితను పరామర్శించారు.
పాలబిందెల ఊరేగింపులో విషాదం
జయలలిత సంపూర్ణ ఆరోగ్యంవతురాలు కావాలని రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూజలు చేస్తున్నారు. తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే మంత్రి అగ్రీ క్రిష్ణమూర్తి ఆధ్యర్యంలో పార్టీ కార్యకర్తలు పాల బిందెల ఊరేగింపు నిర్వహించారు.
అన్నామలై కొండ మీద ఆరుల్ మిగ్గు పచ్చాయమ్మాన్ ఆలయం దగ్గర నుంచి శ్రీ అరుణాచలేశ్వర ఆలయం దగ్గరకు ఊరేగింపుకుగా వెలుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వీఓసీ నగర్ కు చెందిన కమలా సమంతం ( 67) అనే వృద్దురాలు మరణించారు.
మరో 15 మంది సోమ్మసిల్లారు. సుమారు 10 వేల మందికి పైగా ఈ ఊరేగింపులో పాల్గోన్నారు. ఈ విషయంపై తమకు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని స్థానిక పోలీసులు అంటున్నారు. గాయపడిన వారు తిరువణ్ణామలై ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.