జయలలిత డెత్ సర్టిఫికెట్ ఇదే.. జారీ చేసిన చెన్నై గ్రేటర్
తాజాగా అమ్మ మరణాన్ని ధ్రువీకరిస్తూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డెత్ సర్టిఫికెట్(మరణ ధ్రువీకరణ) ను విడుదల చేసింది.
చెన్నై: తమిళ రాజకీయాలను అత్యంతగా ప్రభావితం చేసిన ఓ స్త్రీ శక్తి మంగళవారం అర్థరాత్రి కన్నుమూసింది. విషన్న వదనాలతో యావత్తు తమిళ జాతి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ ఇక లేరన్న మరణవార్తను ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఆమె మరణం తీరని లోటు అని నేతలు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా అమ్మ మరణాన్ని ధ్రువీకరిస్తూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డెత్ సర్టిఫికెట్(మరణ ధ్రువీకరణ) ను విడుదల చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు చెన్నై గ్రేటర్ నుంచి ఈ సర్టిఫికెట్ జారీ అయింది. 2016 డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30కి 68 ఏళ్ల జయలలిత మృతి చెందినట్లుగా అందులో పేర్కొన్నారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా తెలిపారు.
జయలలిత తల్లిదండ్రులు జె.సంధ్య, ఆర్.జయరామ్ పేర్లు సర్టిఫికెట్ లో పొందుపర్చారు. చెన్నై పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో నంబర్18 ఇంట్లో జయ నివాసమున్నట్లుగా అందులో పేర్కొన్నారు. కాగా, డెత్ సర్టిఫికెట్ లో ఆధార్ నంబర్ ను పొందపర్చకపోవడం గమనార్హం.