మాజీ ప్రధాని మనుమడు కనపడటం లేదు, న్యూస్ పేపర్లో ప్రకటన, హై కోర్టు, దెబ్బకు!
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు, హాసన్ లోక్ సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ కనపడటం లేదని, సమన్లు తీసుకోలేని న్యాయవాది చెప్పడంతో దిన పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ సభ్యులు, జేడీఎస్ నాయకులు షాక్ కు గురైనారు.

లోక్ సభ ఎన్నికలు
గత లోక్ సభ ఎన్నికల సమయంలో హాసన్ నియోజక వర్గం నుంచి మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ మనుమడు, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నికల కమిషన్ కు ఆస్తుల వివరాల అఫిడవిట్ సమర్పించాడు.

తప్పుడు సమాచారం !
ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో ప్రజ్వల్ రేవణ్ణ ఆయన ఆస్తుల పూర్తి వివరాలు ఇవ్వలేదని, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి, ప్రజ్వల్ రేవణ్ణ మీద పోటీ చేసిన ఏ. మంజు (బీజేపీ) ఫిర్యాదు చెయ్యడంతో హైకోర్టు విచారణ చేపట్టింది.

హైకోర్టు సమన్లు
కర్ణాటక హైకోర్టు కేసు విచారణ చేసి జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సమన్లు జారీ చేసింది. అయితే జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాత్రం ఇంత వరకు హై కోర్టు సమన్లు తీసుకోలేదు. ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు సమన్లు ఇవ్వడానికి కోర్టు సిబ్బంది, న్యాయవాది ఇంత వరకు ప్రయత్నించారు.

ఎంపీ కనపడటం లేదు
హాసన్ లోని జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి వెళ్లి ఆయనకు సమన్లు ఇవ్వడానికి ప్రయత్నించామని, ఆయన ఇచ్చిన చిరునామాలో లేరని, చాల రోజుల నుంచి సమన్లు ఇవ్వడానికి ప్రయత్నించినా ఆయన కనపడటం లేదని న్యాయవాది హై కోర్టులో చెప్పారు.

దిన పత్రికల్లో ప్రకటన
సమన్లు తీసుకోలేని ప్రజ్వల్ రేవణ్ణకు పత్రికా ప్రకటన ద్వారా విషయం తెలియజేయడానికి హై కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు సమన్లుకు సరైన సమాధానం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. హై కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా, సమన్లు తీసుకోకుండా నిర్లక్షం చేస్తే జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మీద కోర్టు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

ఎంపీ పదవికి ఎసరు !
హాసన్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ మంత్రి ఏ. మంజు పోటీ చేసి ప్రజ్వల్ రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. ప్రజ్వల్ రేవణ్ణ తప్పుడు ఆస్తి వివరాలు సమర్పించారని, ఆయన్ను ఎంపీ పదవి నుంచి అనర్హుడు చెయ్యాలని ఏ. మంజు కోర్టును ఆశ్రయించారు. ప్రజ్వల్ రేవణ్ణ తప్పుడు ఆస్తి వివరాలు సమర్పించారని వెలుగు చూస్తే ఆయన ఎంపీ పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications