
జేఈఈ అడ్వాన్స్డ్ 2021 పరీక్ష అక్టోబర్ 3న: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారైంది. ఈ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ పరీక్ష జులై 3న జరగాల్సి ఉన్నప్పటికీ కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అక్టోబర్ 3న జరుగుతుందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనావైరస్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఖరగ్పూర్ ఐఐటీ నిర్వహించనుంది. కాగా, జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష తేదీలు ఇటీవల మారాయి. ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1,2 తేదీల్లో చివరి విడత పరీక్షలు జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు.
మరోవైపు దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం 11,54,444 నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 39,361 మందికి కరోనా సోకినట్లు తేలింది. గత 24 గంటల్లో 416 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 4,20,967కి చేరింది. మార్చి 30న 354 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత మృతుల సంఖ్యలో ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆదివారం 35,968 మంది కోలుకున్నారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 43 కోట్ల మందికిపైగా కరోనా టీకా తీసుకున్నారు.
Recommended Video
JEE (Advanced) 2021 examination for admission in IITs will be held on the 3rd October 2021. The examination will be conducted adhering to all Covid-protocols, tweets Union Education Minister Dharmendra Pradhan pic.twitter.com/gIMdwfcKn8
— ANI (@ANI) July 26, 2021