జార్ఖండ్ లో ఓడింది నేనే.. బీజేపీ కాదన్న సీఎం.. సోరెన్కు విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. రెండో సారి సీఎం కావాలనుకున్న రఘుబర్ దాస్ కల కల్లగానే మిగిలిపోయింది. ఎన్నికల ఫలితాలపై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్న వేళ.. మరీ ముఖ్యంగా వేళ్లన్నీ మోడీ, షా వైపు చూపుతున్నవేళ.. సీఎం రఘుబర్ దాస్ సంచలన కామెంట్లు చేశారు.
థాంక్యూ జార్ఖండ్.. ఫలితాలపై కాబోయే సీఎం రియాక్షన్.. ఓటమి అంగీకరించిన బీజేపీ
బాధ్యత నాదే..
‘‘జార్ఖండ్ లో ఓడిపోయింది నేనే.. బీజేపీ కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. నా వల్లే అధికారం కోల్పోయాం. ఇందులో పార్టీని, ఇతర నేతల్ని నిందించాల్సిన పనిలేదు. ప్రజా తీర్పును మేం గౌరవిస్తున్నాం‘‘ అని రఘుబర్ దాస్ చెప్పారు. జెంషెడ్ పూర్ ఈస్ట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన.. ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో దాదాపు ఓడిపోయారు.
కాబోయే సీఎంకు ప్రధాని మోడీ విషెస్
జార్ఖండ్ లో మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన జేఎంఎం కూటమిని, కాబోయే సీఎం హేమంత్ సోరెన్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బీజేపీ ఓటమిపై స్పందిస్తూ.. ‘‘రాష్ట్రానికి ఎక్కువ కాలం సేవచేసే అవకాశం బీజేపీకి కల్పించినందుకు జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ అభినందనలు. ఇకముందు కూడా జార్ఖండ్ ప్రజల కోసం బీజేపీ పనిచేస్తునే ఉంటుంది‘‘అని మోడీ తెలిపారు.
ఇవీ తాజా నంబర్లు..
మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి సోమవారం వెల్లడైన ఫలితాల్లో 30 సీట్లు సాధించిన జేఎంఎం అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 15, ఆర్జేడీ, ఎన్సీపీ చెరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బీజేపీ 26 సీట్లు గెలవగా, ఏజేఎస్ యూకు 2, జేవీఎంకు 3, కమ్యూనిస్ట్ పార్టీ ఒకచోట, ఇద్దరు ఇండిపెండెట్లు గెలుపొందారు.