ఈ దేశంలో బీజేపీ ఉన్నంత కాలం ముస్లింలకు రిజర్వేషన్లు దక్కవ్
Jharkhand Assembly elecrtions 2024: దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.
మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 11.84 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 66.84 లక్షలు.
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. పాలము జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా- కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. మత రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ ధ్వజమెత్తారు. ముస్లిం సంతుష్టికరణకు ప్రాధాన్యత ఇస్తోన్నాయంటూ ఆరోపించారు.
ముస్లిం రిజర్వేషన్లను దీనికి ఉదాహరణగా చూపించారు అమిత్ షా. ముస్లింల కోసం ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీల ప్రయోజనాలను కాంగ్రెస్ పణంగా పెడుతోందంటూ మండిపడ్డారు. వీరికి దక్కాల్సిన రిజర్వేషన్లల్లో కోత పెట్టి ముస్లింలకు పంచుతోందంటూ నిప్పులు చెరిగారు.
ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మతపరమైన రిజర్వేషన్లను తాము అమలు చేయబోమని అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ ఉన్నంత కాలం ఈ దేశంలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండబోవని కుండబద్దలు కొట్టారు. తమకు 10 శాతం మేర రిజర్వేషన్లను కల్పించాలంటూ కొంతమంది ఉలేమాలు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలను కలిసి వినతిపత్రం ఇచ్చారని అన్నారు.
ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను కల్పించారని, దీన్ని తొలగించడం లేదా కోత పెట్టే హక్కు ఎవరికీ లేదని అమిత్ షా అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాలనే ఆలోచనను విరమించాలని రాహుల్ గాంధీకి హెచ్చరించారు.
కాంగ్రెస్ను ఓబీసీ వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు అమిత్ షా. అధికారంలో ఉన్నన్ని రోజులూ ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రిజర్వేషన్లపై 1950లో కాకా కేల్కర్ కమిటీ నివేదిక ఇస్తే ఇప్పటివరకు దాని ఆచూకీ తెలియట్లేదని అన్నారు. మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడానికి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అడ్డుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications