Jio 5G: యూజర్లకు అద్దిరిపోయే దీపావళి కానుకను ప్రకటించిన ముఖేష్ అంబానీ
ముంబై: దేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకుని రానుంది. మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ల కంటే ముందుగానే ఈ సేవలను వినియోగదారులకు అందించనుంది. తొలిదశలో ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ఈ సేవలను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలను రూపొందించుకుంది రిలయన్స్ జియో మేనేజ్మెంట్.
ఇదివరకే వేలం..
5జీ సర్వీసుల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్ను కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే వేలం వేసిన విషయం తెలిసిందే. 4జీతో పోల్చుకుంటే 10 రెట్ల వేగం ఉంటుంది 5జీకి. 20 సంవత్సరాల పాటు కాల పరిమితితో ఈ వేలం పాటలను టెలికాం శాఖ నిర్వహించింది. 72097.85 మెగా హెర్ట్జ్ సామర్థ్యం గల స్పెక్ట్రమ్ 5జీని వేలానికి ఉంచింది. మొత్తం మూడు ఫ్రీక్వెన్సీల్లో ఈ వేలంపాటకు వచ్చాయి.
మూడు ఫ్రీక్వెన్సీల్లో..
లో- రేంజ్ అంటే.. 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగా హెర్ట్జ్, మిడ్ రేంజ్ అంటే.. 3300 మెగా హెర్ట్జ్, అలాగే హై రేంజ్ అంటే.. 26 గిగా హెర్ట్జ్ సామర్థ్యంతో ఈ స్పెక్ట్రమ్ వేలంపాట ఉంటుంది. మిడ్ అండ్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ను టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ వినియోగించుకునే అవకాశం ఉంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం పాటలో టెలికం బిగ్ షాట్స్ పాల్గొన్నాయి. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో, గౌతమ్ అదాని నాయకత్వాన్ని వహిస్తోన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు పోటీలో నిల్చున్నాయి.
తొలిదశలో నాలుగు నగరాల్లో..
దీనితో పాటు సునీల్ మిట్టల్కు చెందిన భారతి ఎయిర్టెల్, కుమారమంగళం బిర్లా ఆధీనంలోని వొడాఫోన్ ఐడియా బిడ్స్ దాఖలు చేశాయి. వేలంలో స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసిన రిలయన్స్ జియో యాజమాన్యం- మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ల కంటే ముందుగా వాటిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి ముహూర్తాన్ని కూడా పెట్టింది. తొలిదశలో నాలుగు మెట్రో సిటీలను ఎంపిక చేసింది.
దీపావళి నాటికి..
5జీ సర్వీసులను దీపావళి నాటికి యూజర్లకు అందజేయనున్నట్లు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే వార్షిక సర్వసభ్య సమావేశంలో వారు ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత మెట్రో సిటీల్లో తొలి విడతగా ఈ సర్వీసులను ప్రవేశపెడతామని, డిసెంబర్ నాటికి అన్ని సిటీల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
5జీ నెట్వర్క్ కోసం..
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విస్తరింపజేయడానికి రెండు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టబోతోన్నామని ముఖేష్ అంబానీ చెప్పారు. తొలి దశలో 5జీ నెట్వర్క్లో విస్తరింపజేయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ సొల్యూషన్ టీమ్స్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నెట్వర్క్ ప్లానింగ్లో 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ వంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో పైలెట్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేశామని వివరించారు.