ఇండియన్ ఆర్మీపై కన్నయ్య కుమార్ తీవ్ర వ్యాఖ్య
న్యూఢిల్లీ: టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) విద్యార్థి కన్నయ్య కుమార్ మరోసారి వర్సిటీలో వివాదాస్పద ప్రసంగం చేశాడు. భారత సైన్యం పైన తీవ్ర, దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైన్యంపై అతడు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాశ్మీర్ మహిళలపై భారత సైనికులు అత్యాచార పరంపర సాగిస్తున్నారని అతడు ఆరోపించాడు. మంగళవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతను మాట్లాడాడు.
ఈ సందర్భంగా అతను పైవ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, కాశ్మీర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ (ఏఎఫ్ఎస్పీఏ)కు వ్యతిరేకంగా గళం ఎత్తుతానని కూడా అతను వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
పార్లమెంటుపై జరిగిన దాడిలో దోషిగా తేలి ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు మద్దతుగా.. వర్సిటీలో విద్యార్థులు గత నెల 9 వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. ఇటీవలి వరకు జైల్లో గడిపిన అతడు నాలుగు రోజుల క్రితం విడుదలయ్యాడు.