బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా..: కార్యవర్గ సమావేశాల్లో ఖరార్..!!
న్యూఢిల్లీ: భారతీయ జనత పార్టీ జాతీయ కార్యవర్గం రెండో రోజు సమావేశమైంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కన్వెన్షన్ హాలులో ఈ భేటీ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధ్యక్షులు, జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఏపీ నుంచి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ నుంచి బండి సంజయ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, పార్టీ మేనిఫెస్టో రూపకల్పన వంటి అంశాలపై ఇందులో చర్చిస్తోన్నారు. తెలంగాణ సహా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ లల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగాల్సి ఉంది.
ఈ భేటీ సందర్భంగా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికల వరకు ఆయనే కొనసాగుతారని వెల్లడించారు. జేపీ నడ్డా నాయకత్వంలో చిరస్మరణీయమైన విజయాలను సాధించామని, అందుకే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పొడించాలని తీర్మానించినట్లు చెప్పారు.
జేపీ నడ్డా సారథ్యంలో- బిహార్, మహారాష్ట్రల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోగలిగామని అమిత్ షా చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్ తాము ఓడిపోయినప్పటికీ.. సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇందులో జేపీ నడ్డా అనుసరించిన వ్యూహాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని అన్నారు. గుజరాత్లో కూడా పార్టీ అద్భుత విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.
ఈ ఏడాది జరగబోయే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా విజయాలను సాధించడానికి జేపీ నడ్డా నాయకత్వంలో పని చేయాల్సిన అవసరం ఉందని తాము భావిస్తోన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. నడ్డా సారథ్యంలో మరిన్ని విజయాలను సొంతం చేసుకోగలమని, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పుడు ఉన్న లోక్ సభ సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోగలుగుతామనే ధీమాను వ్యక్తం చేశారు అమిత్ షా.