ఫోర్జరీ కేసులో మంత్రి, బయటపడతానని విశ్వాసం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో చేరిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ శంకర్ కతేరియా ఫోర్జరీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన డిగ్రీ మార్కుల జాబితాను ఫోర్జరీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
గతంలో ఆగ్రా యూనివర్సిటీలో ఉద్యోగం కోసం తన డిగ్రీ మార్క్స్ షీట్ను మార్చారన్నది ఆయనపై ఆరోపణ. డిగ్రీ రెండవ సంవత్సరంలో హిందీలో 43, ఇంగ్లీష్ లో 42 మార్కులు రాగా వాటిని 52, 53గా మార్చారని, ఎంఏలోను ఒక సబ్జెక్టులో వచ్చిన 38 మార్కులను 72గా మార్చారని ఆరోపణలు వచ్చాయి.
ఈ అంశాన్ని హైకోర్టు ఆగ్రా సెషన్స్ కోర్టుకు రిఫర్ చేసింది. దీంతో పోలీసులు ఆయనపై సెక్షన్ 420 కింద కేసు పెట్టి విచారణ ప్రారంభించారు. ఈ నెల 26న ఈ కేసు విచారణకు రానుంది. అయితే ఈ కేసును తన ప్రత్యర్థి, 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన బహుజన సమాజ్ పార్టీ నేత ఒకరు పెట్టారని కతేరియా ఆరోపించారు.
తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. గతంలో ఇదే ఆరోపణలపై బీఎస్పీ ప్రభుత్వం రోజుకు నాలుగు కేసులు పెట్టేదన్నారు. మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వం తనపై విచారణ జరిపి నిరపరాధినని తేల్చిందని వివరించారు. ఈ కేసు నుంచి కూడా బయటపతానని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఐతే ఈ కేసు రుజువైతే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ఎన్నికల్లో పాల్గొనే అర్హత కొల్పోతారు. కాగా ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన సమాచారం మేరకు ఆయనపై మొత్తం 21 క్రిమినల్ కేసులు ఉన్నాయి. స్వతహాగా ప్రొఫెసర్ అయిన రామ్ శంకర్ కతేరియా ప్రస్తుతం మోడీ మంత్రి వర్గంలో విద్యా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.