లిస్టింగ్లో లేని మరో కేసుకు ఆర్డర్ ఇచ్చిన జడ్జి..చిదంబరంకు ఎందుకివ్వలేదు..?
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కోసం ఆయన లాయర్లు బెయిల్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. బుధవారం బెయిల్కోసం ప్రయత్నించిన వీరికి సుప్రీంకోర్టులో చుక్కెదురే అయ్యింది. బెయిల్ పిటిషన్ను విచారణకు తీసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ బెయిల్కు సంబంధించి ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేనని చెప్పారు. అంతేకాదు ఆ పిటిషన్ను చీఫ్జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనానికి పంపారు. కేసు కోర్టు లిస్టింగ్లో లేకుండా విచారణకు తీసుకోలేమని చిదంబరం తరపున లాయర్ కపిల్ సిబల్కు తెలిపారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇదిలా ఉంటే చీఫ్ జస్టిస్ అయోధ్య కేసుతో బిజీగా ఉండగా... ఆ తర్వాత సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ లిస్టింగ్లో లేని ఓ కేసులో ఆర్డర్ ఇచ్చారు. చిదంబరం కేసులో మాత్రం ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్.
20 కీలక ప్రశ్నలు.. చెప్పలేను, స్పష్టంగా తెలియదు.. సీబీఐకి చిదంబరం సమాధానాలు..!
భూషణ్ స్టీల్స్కు సంబంధించిన కేసులో ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మరియు డైరెక్టర్ నితిన్ జోహారీకి అప్పటి వరకు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ జస్టిస్ ఎన్వీ రమణ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఈ కేసు లిస్టింగ్లో లేదు. అయినప్పటికీ జస్టిస్ రమణ ఆర్డర్ పాస్ చేశారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఈ కేసును దాఖలు చేసింది.సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు విచారణ చేసి లిస్టింగ్లో లేని కేసుకు ఆర్డర్ పాస్ చేశారు. ఇదిలా ఉంటే జోహరీ పలు మోసాలకు పాల్పడటమే కాకుండా... కొన్ని బ్యాంకులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరెస్టు చేయడం జరిగింది. ఆగష్టు 14న ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్ఎఫ్ఐఓ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
బెయిల్ వస్తే దేశం దాటే ప్రమాదం ఉందన్న వాదనలతో ఏకీభవించిన జస్టిస్ రమణ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే విధించారు.చిదంబరం అరెస్టు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జస్టిస్ ఎన్వీ రమణను కపిల్ సిబల్ కోరగా లిస్టింగ్లో లేని కేసును ఎలా విచారణ చేస్తానంటూ ఎన్వీరమణ చెప్పడంతో జోహరీ కేసును కపిల్ సిబల్ ప్రస్తావించారు. జోహరీ కేసులో ఎలాగైతే ఆర్డర్ పాస్ చేశారో అలానే చిదంబరం కేసులో కూడా ఆర్డర్ పాస్ చేయాలని సిబల్ జస్టిస్ ఎన్వీరమణను కోరారు. అయితే జోహరీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నందున ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ కేసు వేరు చిదంబరం కేసు వేరు అని జస్టిస్ ఎన్వీ రమణ చెబుతూ ఆర్డర్ ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది.