సీజేఐ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ
ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న ధర్మాసనం నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ కేసులో అంతర్గత విచారణ జరుపుతున్న జడ్జిల్లో ఒకరైన ఆయనను తప్పించాలని ఆరోపణలు చేసిన మహిళ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు, చీఫ్ జస్టిస్తో పాటు, ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సదరు మహిళ కోర్టుకు విన్నవించింది. జస్టిస్ రమణ తరుచూ సీజేఐ ఇంటికి వెళ్తుంటారన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చింది.
కేసు అంతర్గత విచారణకు ఏర్పాటు చేసిన ధర్మాసనంలో విశాఖ గైడ్లైన్స్ పాటించలేదని సదరు మహిళ ఆరోపించింది. విచారణ జరుపుతున్న ప్యానెల్లో మహిళా సభ్యుల కన్నా పురుషుల జడ్జిల సంఖ్య ఎక్కువగా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి జస్టిస్ రమణను తప్పించింది. ఆయన స్థానంలో మరో జడ్జిని గురువారం సాయంత్రంలోగా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.