సుప్రీం కోర్టులో మరో తెలుగు న్యాయమూర్తి నియామకం..!!
జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీంతో, సుప్రీంలో తెలుగు జడ్జిల సంఖ్య రెండుకు చేరింది.
సుప్రీంకోర్టులో మరో తెలుగు న్యాయమూర్తి నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టులో అయిదుగురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు జడ్జిగా జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు. ఇప్పుడు మరో న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ నియమితులయ్యారు. తాజా నియామకాలతో గత ఏడాది డిసెంబరు 13న కొలీజియం సిఫారసు చేసిన అన్ని పేర్లను కేంద్రం ఆమోదించింది. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు రేపు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సుప్రీంకోర్టుకు తాజాగా నియమితులైన న్యాయమూర్తుల్లో హైదరాబాద్కు చెందిన జస్టిస్ పీవీ సంజయ్కుమార్ ఉన్నారు. 1963 ఆగస్టు 14న జస్టిస్ సంజయ్కుమార్ జన్మించారు. స్టిస్ సంజయ్కుమార్ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా. ఆయన కుటుంబం అనేక సంవత్సరాల క్రితమే హైదరాబాద్లో స్థిరపడింది. జస్టిస్ సంజయ కుమార్ తండ్రి సుదీర్ఘ కాలం ఉమ్మడి ఏపీలో అడ్వకేట్ జనరల్ గా పని చేసారు. సంజయ్ కుమార్ తండ్రి పి.రామచంద్రా రెడ్డి 1969-82 మధ్యకాలంలో అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించారు. నిజాం కాలేజీలో సంజయ్ కుమార్ కామర్స్ పూర్తి చదువుకున్నారు. 1988లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. తన తండ్రి వద్దే జూనియర్ గా చేరారు.
సంజయ్ కుమార్ పలు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసారు. ప్రముఖ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్.. హిందుస్థాన్ పెట్రోలియ్ కార్పోరేషన్ లిమిటెడ్ తో పాటుగా హైదరాబాద్ పట్టణ భూ సీలింగ్ ప్రత్యేక అధికారి తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు. 2000 లో సంజయ్ కుమార్ ఏపీ ప్రభుత్వ న్యాయవాదిగా పని చేసారు. 2003 వరకు కొనసాగారు. 2008లో ఉమ్మడి ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన సంజయ్ కుమార్ 2010 జనవరిలో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019లో పంజాబ్ - హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2021లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి..ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీంతో..ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరుకుంది.