తండ్రి సుప్రీంకోర్టు న్యాయవాది..కుమారుడు ప్రధాన న్యాయమూర్తి..! చీఫ్ జస్టిస్ గా బొబ్డే నియామకం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ ఏ బొబ్డె నియమితులయ్యారు. బొబ్డె నియమకానికి సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 18వ తేదీన బొబ్డె ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ఆయనతో ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. సుప్రీంకోర్టుకు బొబ్డె..47వ ప్రధాన న్యాయమూర్తి. 2021 ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయన రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తి. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పదవీ కాలం వచ్చే నెల 17వ తేదీన ముగియనుంది. ఆ మరుసటి రోజే బొబ్డె ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం.. తన వారసుడు ఎవరనే విషయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తిపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో- రంజన్ గొగొయ్ కొద్ది రోజుల కిందటే ఎస్ ఏ బొబ్డె పేరును సిఫారసు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తుల కొలీజియానికి బొబ్డె పేరును పంపించారు.
తండ్రి న్యాయవాదిగా పనిచేసిన చోట..
బొబ్డె తండ్రి అరవింద్ శ్రీనివాస్ బొబ్డే సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వొకేట్ గా పనిచేశారు. తండ్రి న్యాయవాదిగా సేవలను అందంచిన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కుమారుడు నియమితులు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయోధ్య ధర్మాసనంలో.. సుప్రీంకోర్టులో రంజన్ గొగొయ్ తరువాత ఆ స్థాయిలో సీనియారిటీగా ఉన్న న్యాయమూర్తి బొబ్డె మాత్రమే. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై విచారణ కొనసాగించడానికి ఏర్పాటైన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో ఎస్ ఎ బొబ్డె ఒకరు. అయోధ్య భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఆయన పేరు విస్తృతంగా వినిపించింది. అంతకుముందు కూడా కొన్ని సున్నితమైన అంశాలపై ఆయన అందరికీ ఆమోద యోగ్యమైన తీర్పులను ఇచ్చారు.
మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా..
బొబ్డె మహారాష్ట్రీయుడు. నాగ్ పూర్ ఆయన స్వస్థలం. 1956 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. బాంబే హైకోర్టు అనుబంధంగా కొనసాగుతోన్న నాగ్ పూర్ బెంచ్ 1978లో తన పేరును నమోదు చేసుకున్నారు. అడ్వొకేట్ గా న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2000 మార్చి 29వ తేదీన ఆయన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2012 అక్టోబర్ 16వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆరు నెలల తరువాత ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారు.
ఆధార్ కార్డు లింకేజీపై కీలక తీర్పు..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న అన్ని సంక్షేమ పథకాలు సహా బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఇతర కార్యకలాపాలను ఆధార్ కార్డుతో లింకు చేయాడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టింది ఆయనే. బొబ్డె సారథ్యంలో ఏర్పాటైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జాస్తి చలమేశ్వర్, చొక్కలింగం నాగప్పన్ లతో కలిసి ఆయన ఆ పిటీషన్ పై విచారణ నిర్వహించారు. కేశవానంద భారతి, అయోధ్య భూ వివాదం తరువాత సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగిన కేసుగా ఆధార్ కార్డు పిటీషన్ కు గుర్తింపు ఉంది. 38 రోజుల పాటు కొనసాగిన ఆధార్ కార్డు లింకేజీపై బొబ్డె సారథ్యంలోని ధర్మాసనం కార్డుదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.