justice uu lalit oath ceremony : 49వ సీజేఐగా యూయూ లలిత్ ప్రమాణం-74 రోజులకే..
49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ప్రస్తుత న్యాయమూర్తులు కూడా హాజరయ్యారు.
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించారు. ఆయన వయసు 64 ఏళ్లు. 2014 ఆగస్ట్ 13న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా బాధ్యతలను స్వీకరించిన రికార్డు కూడా ఆయనకు ఉంది.

దేశ చరిత్రలో జస్టిస్ యూయూ లలిత్ తో పాటు మరొకరు మాత్రమే లాయర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణ స్వీకారం జస్టిస్ యూయూ లలిత్ చాలా స్వల్పకాలం మాత్రమే ఈ పదవిలో ఉంటారు. కేవలం 74 రోజుల్లోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత మరో ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు.
మరోవైపు నిన్న భారత ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ఆయనకు రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కూడా వారితో కలిసి ఉల్లాసంగా కనిపించారు. మాజీ సీజేఐకి ఏడాది పాటు ఢిల్లీలోనే నివాస సదుపాయం కల్పించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడంతో ఎన్వీ రమణ అక్కడే ఉండబోతున్నారు.












Click it and Unblock the Notifications