పాక్ ఆర్మీ, ISI తో జ్యోతి మల్హోత్రాకు సంబంధాలు.. పహల్గాం ఉగ్రదాడికి ముందు పాక్ కు.. సంచలన విషయాలు బయటకు
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె కేసులో సంచలన విషయాలను పోలీసులు బయటపెట్టారు. ఆమె బయటపెట్టిన ఆదాయం వివరాలు.. ఆమె ప్రయాణించిన ప్రదేశాల వివరాలు అసలు మ్యాచ్ కాలేదని హిస్సార్ ఎస్పీ సావన్ తెలిపారు. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ కు చాలా సార్లు ప్రయాణించిందని.. పహల్గాం ఉగ్రదాడికి ముందు భారత్ లోనే ఉందని వెల్లడించారు. ఆమెకు పాకిస్థాన్ ఆర్మీతో, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ సావన్ వెల్లడించారు.
సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి మల్హోత్రా దేశాన్ని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్థాన్ ఏజెంట్లతో జ్యోతి సంప్రదింపులు జరిపి.. సమాచారం చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైనే మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తన మాటలతో, అందాలతో లక్షలాది మందిని ఆకర్షించింది జ్యోతి మల్హోత్రా. పాకిస్థాన్ కు వెళ్లినప్పుడు అక్కడ ISI ఏజెంట్ డానిష్తో పరిచయం దేశద్రోహానికి దారితీసింది. అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్ఐ అధికారులను కలిసిన జ్యోతి.. ఆ తర్వాత షకీర్ , రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అయితే జ్యోతి మల్హోత్రా.. తన ట్రావెల్ లో చైనా, పాకిస్థాన్ సహా 8 దేశాలు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు కూడా జ్యోతి కాశ్మీర్.. అక్కడి నుంచి పాకిస్థాన్ కు వెళ్లినట్లు ఆమె.. తన యూట్యూబ్ ఛానలో పోస్టు చేసిన వీడియోలు, షార్ట్స్ ద్వారా అర్థమవుతోంది. అంతేకాక పాకిస్థాన్ రాయబార కార్యాలయంలోని అధికారికి జ్యోతి పరిచయం అట. ఆయన చొరవతో జ్యోతి.. పాకిస్థాన్ లోని పలు ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. ఆ ప్రదేశాలకు సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టమని పోలీసుల విచారణలో తేలింది.

అంతేకాదు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్తో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా నవాజ్ షరీఫ్ ను జ్యోతి కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఈ కేసులో ప్రాథమిక విషయాలు పోలీసులు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె సహచరులు పట్టుబడ్డారని, ప్రస్తుతం వీరికి 5 రోజుల రిమాండ్ ఉందని, విచారిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications