బీజేపీలో బ్యాక్ బెంచర్, ఎప్పటికీ సీఎం కాలేరు: రాహుల్కి జ్యోతిరాదిత్య సింధియా చురకలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ధీటుగా కౌంటర్ ఇచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరి వెనుక బెంచీకి పరిమితమయ్యారని, ఆ పార్టీలో ఉంటే ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కాలేరంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
రాహుల్ వ్యాఖ్యలకు సింధియా చురకలు
ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా ధీటుగా స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఈ విధంగా ఆలోచించి ఉంటే.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉండేది కాదంటూ ఆయనకు చురకలంటించారు జ్యోతిరాదిత్య సింధియా. అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో తనకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా, పార్టీ మారిన తర్వాత ఇలా మాట్లాడం వల్ల లాభం లేదంటూ సింధియా హితవు పలికారు.
సింధియా దెబ్బకు కూలిన కాంగ్రెస్ సర్కారు
కాగా, గత ఏడాది మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలంతా తిరిగి గెలుపొందడం గమనార్హం. ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా సింధియా కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటే సింధియా సీఎం అయ్యే వారంటూ రాహుల్
యూత్ వింగ్ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఇటీవల మాట్లాడుతూ.. జ్యోతిరాదిత్య సింధియాపై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండివుంటే.. సింధియా ముఖ్యమంత్రి అయ్యేవారని, బీజేపీలోకి చేరి చివరి బెంచీలోనే ఉండిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయనకు సూచించాను.. ఏదో ఒక రోజు సీఎం అవుతావని కూడా చెప్పాను.. కానీ, సింధియా మరో మార్గాన్ని ఎంచుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉంటే సింధియా ఎప్పటికీ సీఎం కాలేరన్నారు. ఈ నేపథ్యంలోనే సింధియా కౌంటర్ ఇచ్చారు. కాగా, రాహుల్, సోనియా దూరం పెట్టడం వల్లే సింధియా పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్పడం గమనార్హం.