కేఏ కనపడితే అంతే: తమిళనాడు బంద్ కు ప్రతిపక్షాల పిలుపు
చెన్నై: కావేరీ జలాల పంపిణి విషయంలో ఇప్పటి వరకు బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న లారీలు, బస్సులు బూడిద చేశారు.
ఇప్పుడు తమిళనాడులో కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న వాహనాలకు ఆందోళన కారులు నిప్పంటించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రిజిస్ట్రేన్ నెంబర్ కనపడితే చాలు ఆ వాహనాలు ధ్వంసం చేస్తున్నారు.
తమిళనాడులోని ఈరోడ్ లో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న లారీలకు అక్కడి అందోళనకారులు నిప్పుపెట్టారు. బెంగళూరు నగరంలో తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న లారీలను బూడిద చెయ్యడంతో ప్రతీకారంగా తమిళనాడులో కర్ణాటక వాహనాలకు నిప్పంటిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనాకారులను చెదరగొట్టి లారీలకు వ్యాపించిన మంటలు అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు.
తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చిన ప్రతిపక్షాలు
సెప్టెంబర్ 16వ తేది శుక్రవారం తమిళనాడు బంద్ కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. గురువారం తమిళనాడు బంద్ చేస్తామని రైతు సంఘం నాయకుడు ధనపాలన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రతిపక్షాలు అన్నీ శుక్రవారం బంద్ కు పిలుపునివ్వడంతో గురువారం బంద్ వాయిదా పడింది. తమిళనాడు బంద్ కు ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే మద్దతు ఇస్తున్నది. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా చూడటానికి పోలీసులు సిద్దం అయ్యారు.
చెన్నై నగరంతో పాటు తమిళనాడులో నివాసం ఉంటున్న కన్నడిగులకు భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే భయంతో చాల మంది కన్నడిగులు కర్ణాటకకు తరలివస్తున్నారు.