కీలకమైన కైరానా లోకసభ నియోజకవర్గంలో బీజేపీ ఓటమికి కారణాలు ఎన్నో
లక్నో: ఇటీవల కీలక కైరానా లోకసభ నియోజవకర్గంలో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలవడం. ఈ పార్టీలన్నీ కలిసినా బీజేపీని కేవలం యాభై వేల పై చిలుకు ఓట్లతో మాత్రమే ఓడించాయి. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
దీనికి తోడు ఇదే సమయంలో పెరుగుతున్న పెట్రోలు ధరలు, ముస్లీంలు - జాట్లు ఏకం కావడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. కైరానా లోకసభ నియోజకవర్గంలో నకుర్, గంగోహ్, కైరానా, థానాభవన్, షామ్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నకుర్, గంగోహ్ స్థానాలు సహరన్పుర్ జిల్లాలోను, మిగిలిన మూడు స్థానాలు షామ్లి జిల్లాలో ఉన్నాయి.
షామ్లిలో ఉన్న మూడు పంచదార మిల్లులు రైతులకు రూ.512.71 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సహరన్పుర్లో ఉన్న మూడు మిల్లుల బకాయిలు రూ.261.74 కోట్లు మాత్రమే. ఇక్కడి ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, ప్రతిపక్షాలు చెబుతున్నట్లు చెరకు రైతులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల బీజేపీ ఓడిపోలేదని అంటున్నారు.
పైగా బీజేపీకి అండగా ఉంటే జాట్లు ఈసారి ఆర్ఎల్డీకి మద్దతిచ్చిందని అంటున్నారు. పెట్రో ధరల పెంపు కూడా కారణమంటున్నారు. ఇక్కడ ముస్లీం-అహిర్-గుజ్జర్-దళిత ఫార్ములా ఫలించిందంటున్నారు.