కమల్హాసన్ ఆస్తులు రూ. 176 కోట్లు, విద్యార్హత 8వ తరగతి..: ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగనున్న నేపథ్యంలో మక్కల్ నీది మయమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ కోయంబత్తూరు సౌత్ నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు.
తమిళనాడు ఎలక్షన్ ఫైట్ : కోయంబత్తూర్ సౌత్ నుండి ఎన్నికల బరిలోకి కమల్ హాసన్
కమల్హాసన్ ఆస్తులు..
తన మొత్తం ఆస్తులు 176.93 కోట్లుగా కమల్ హాసన్ పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు, చరాస్తులు రూ. 45.09 కోట్లుగా తెలిపారు. లండన్లో రూ. 2.50 కోట్లు ఇల్లు, రూ. 2.7 కోట్ల లెక్సస్ కారు, రూ. కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉన్నాయని వెల్లడించారు. రూ. 49.5 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. తన అఫిడవిట్లో, 2019-20 సంవత్సరానికి పన్ను రాబడి ప్రకారం తన ఆదాయం రూ .12.1 కోట్లు అని చెప్పారు.
కమల్ విద్యార్హత 8వ తరగతి..
ఇక కమల్ హాసన్ విద్యార్హత 8వ తరగతిగా పేర్కొన్నారు. తనపై ఓ కేసు కూడా ఉందని కమల్ హాసన్ తెలిపారు. ఫిబ్రవరి 2018లో పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 3.75 శాతం ఓట్లను సాధించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పోటీ కమల్ పార్టీ పోటీ చేస్తోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ బరిలో ఉన్నారు.
కోయంబత్తూరును అంతర్జాతీయ సిటీగా మారుస్తానన్న కమల్
తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరును జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయి మోడల్ నగరంగా మారుస్తానని కమల్ హాసన్ ప్రచారం సందర్భంగా పేర్కొన్నారు. తాగునీరు, రోడ్లు లాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. విమానాశ్రయాన్ని మరింత విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండగా, కమల్ హాసన్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తోంది మే 2న ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే. కాగా, ఇటీవల కమల్ ప్రయాణిస్తున్న కారుపై ఓ యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కారు అద్దం పగిలింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం ఆ యువకుడ్ని చితకబాదిన ఎంఎన్ఎం నేతలు పోలీసులకు అప్పగించారు.