మదగజం కూడా..: పరిస్థితులపై కమల్హాసన్ పరోక్షంగా.., శశికళకేనా?
తమిళనాడు రాజకీయాల పైన నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించవద్దని వ్యాఖ్యానించారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల పైన నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించవద్దని వ్యాఖ్యానించారు. గడ్డిపోసలన్నీ కలిస్తే మదగజాన్ని బంధించగలవని పరోక్షంగా అన్నారు.
ఆయన వ్యాఖ్యలను అన్నాడీఎంకే పార్టీ నేతగా ఎన్నికైన శశికళను ఉద్దేశించే పేర్కొన్నారని అంటున్నారు. ఆమె శాసన సభా పక్ష నాయకురాలిగా ఆదివారం ఎన్నికయ్యారు. రేపు (మంగళవారం) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటికే నెటిజన్లు, విపక్షాలు, అన్నాడీఎంకోలేని కొందరు అసమ్మతి నేతలు శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీని పైన ఆన్ లైన్ యుద్ధం కూడా చేస్తున్నారు.

శశికళ ఏకగ్రీవ నిర్ణయంపై కొందరు అన్నాడీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న కొందరు నెటిజన్లు భగ్గుమనడం గమనార్హం. శశికళకు సీఎం పీఠం ఎలా కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నియామకాన్ని అడ్డుకునే విధంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి, గవర్నర్కు లేఖ రాస్తామని తమిళనాడుకు చెందిన కొందరు సోషల్ మీడియా యూజర్లు వెల్లడించారు.
ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, ఛేంజ్.ఓఆర్జీ అనే ఆన్లైన్ పిటిషన్ ప్లాట్ఫాం ద్వారా తమ గళాన్ని కేంద్రానికి వినిపించాలని నెటిజన్లు భావిస్తున్నారు.
ఈ ఆన్లైన్ పిటిషన్ ప్లాట్ఫాంలో ఆమెకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. 19వేల మంది శశికళ సీఎం కావడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. ఆమెకు సీఎం అయ్యేందుకు ఏ అర్హత ఉందో చెప్పాలని నినదిస్తున్నారు.
మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకూ పన్నీరు సెల్వమే తమకు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నారు. తాము జయలలితకు ఓటేశామని, శశికళకు కాదని చెబుతున్నారు. అవినీతి కుటుంబానికి తాము ఓటేయలేదని, ఓటేయబోమని నెటిజన్లు ఘాటుగా స్పందించారు.












Click it and Unblock the Notifications