శశికళపై కమల్ హాసన్ వ్యాఖ్యలు: కొద్దిసేపటికే తీర్పు
కోర్టు తీర్పు కోసం మెరీనా బీచ్ ఆత్మ మౌనంగా ఎదురు చూస్తుందని కమల్ హాసన్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది.
చెన్నై: అన్నాడియంకె చీఫ్ శశికళకు వ్యతిరేకంగా తమిళ నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మరికొద్ది నిమిషాల్లో తీర్పు వెలువరిస్తుందనగా కమల్ తన వ్యాఖ్యలను ట్వీట్ చేశారు. "మెరీనా ఆత్మ తీర్పు కోసం మౌనంగా ఎదురు చూస్తోంది" అని ట్వీట్ చేశాడు. వారు (మెరీనా ఆత్మ) ఎప్పుడూ కోర్టు తీర్పులను గౌరవించారని, ఇకపైనా అదే కొనసాగిస్తారని అన్నారు.

"కోర్టులు తమ విధులు తాము నిర్వర్తిస్తాయి. ప్రజలు కూడా తమ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. జయలలిత సమాధి మెరీనా బీచ్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. కమల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ముఖ్యమంత్రి కోసం తాపత్రయపడుతూ ప్రయత్నాలు చేస్తున్న వీకే శశికళ జయలలిత కేసులో సహ నిందితురాలిగా ఉన్నారు. జయలలిత మరణానంతరం ఆమె స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వీకే శశికళ, పన్నీర్ సెల్వం పోటీ పడుతున్న విషయం కూడా తెలిసిందే.












Click it and Unblock the Notifications