Kangana: క్వీన్ కేసు, సార్ నేను అలా అనలేదు, కోర్టు తీర్పు రిజర్వ్, మేడమ్ కు చెమటలు, పిజ్జా గ్యారెంటి
బెంగళూరు/ ముంబాయి/ తుముకూరు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు కష్టాలు ఎదురైనాయి. అన్నం పెట్టే అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చి రైతులను కించపరిచిందని నటి కంగనా రనౌత్ మీద కోర్టులో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. కేసు వాదనలు విన్న న్యాయమూర్తి కంగనా కేసు విచారణ తీర్పు రిజర్వులో పెట్టారు. శుక్రవారం కోర్టు తీర్పు వెలువడనుండటంతో మేడమ్ కంగనాకు చెమటలు పడుతున్నాయని, ఆమెకు పిజ్జా గ్యారెంటీ అని క్వీన్ మీద కోర్టులో కేసు పెట్టిన కర్ణాటక హైకోర్టు న్యాయవాది అంటున్నారు.

కేంద్రం VS అన్నదాతలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కొన్ని రోజుల నుంచి రైతన్నలు భగ్గుంటున్నారు. తమకు నష్టం కలిగించే ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతన్నలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం అన్నదాతల ఆందోళనలతో అట్టడుకిపోయింది. దేశవ్యాప్తంగా అన్నదాతలకు అనేక పార్టీలు, పలు సంఘ సంస్థలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.

రెచ్చిపోయిన కంగనా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్స్ మాఫీయా కేసుల తరువాత ఒక్కసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులపై విరుచుకుపడుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో అన్నదాతలు రోడ్లు ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నలు ఆందోళనలు చేస్తున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ ట్విట్ చెయ్యడం కలకలం రేపింది.

అసలే హైకోర్టు లాయర్
అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ నటి కంగనా రనౌత్ ట్విట్ చేసి రైతన్నలను అవమానించారని, ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయవాది, తుమకూరు నివాసి ఎల్. రమేష్ నాయక్ సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటక డీజీపీ, తుమకూరు జిల్లా ఎస్పీకి ఇ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నటి కంగనా రనౌత్ పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ న్యాయవాది రమేష్ నాయక్ తుముకూరు జేఎంఎఫ్ సీ న్యాయస్థానంలో కేసు పెట్టారు.

దేవుడా నేను అలా అనలేదు
రైతులను ఉగ్రవాదులతో పోల్చిన నటి కంగనా రనౌత్ మీద కేసు నమోదు కావడంతో ఆమె హడలిపోయింది. తాను రైతులను ఉగ్రవాదులతో పోల్చలేదని, వారు రోడ్ల మీద, రైలు పట్టాల మీద నిద్రపోతున్నట్లు నటిస్తున్నారని, నిరసన వ్యక్తం చేసే తీరుఇది కాదని మాత్రమే ట్వీట్ చేశానని క్వీన్ కంగనా రనౌత్ వివరణ ఇచ్చుకునింది.

కోర్టు తీర్పు రిజర్వ్
నటి కంగనా రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ చేసిన ట్వీట్, సోషల్ మీడియా కామెంట్లను కర్ణాటక హైకోర్టు న్యాయవాది రమేష్ తుముకూరు కోర్టుకు సమర్పించారు. కేసు వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం తీర్పు వెళ్లడిస్తామని తుముకూరు న్యాయస్థానం చెప్పింది. రైతులను కించపరిచిన కంగనాకు కోర్టు తగిన బుద్ది చెబుతుందని ఆశగా ఎదురు చూస్తున్నామని, క్వీన్ కు పిజ్జా గ్యారెంటీ అంటూ ఆమె మీద కేసు నమోదు చేసిన న్యాయవాది రమేష్ అంటున్నారు.












Click it and Unblock the Notifications