"నా భార్య కొడుతుంది".. పోలీసులకు ప్రముఖ నటుడి కంప్లైంట్ !!
సినిమాలు, టెలివిజన్ సీరియళ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనుష్ రాజ్ చర్చనీయాంశంగా మారారు. తన భార్య అర్షితపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు ప్రాణహానీ బెదిరింపులకు కూడా పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సమాచారం.
విదేశాలకు వెళ్లిన విషయంలో గొడవ..
కాగా ధనుష్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య అర్షిత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిందని అన్నారు. ఆ విషయం గురించి ప్రశ్నించగా ఆమె తీవ్ర ఆగ్రహంతో తనపై దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటన తర్వాత వారి మధ్య విభేదాలు మరింత పెరిగాయని తెలిపారు. అంతే కాకుండా ఫిర్యాదులో మరో కీలక ఆరోపణ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తనను కొట్టేందుకు గూండాలను పంపిస్తానని, అవసరమైతే చంపేస్తానని భార్య బెదిరించిందని ధనుష్ రాజ్ వివరించారు. ఈ బెదిరింపుల కారణంగా తనకు ప్రాణహానీ ఉందని భయపడుతున్నట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు.

తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నమా?
మరోవైపు అర్షిత కావాలనే బాత్రూమ్లో ఉన్న గాజు పలకకు తన చేతిని కొట్టుకుని గాయపర్చుకుందని.. ఆ తర్వాత తానే ఆమెపై దాడి చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తానని బెదిరించిందని ధనుష్ రాజ్ ఆరోపించారు. తనపై కేసు పెట్టేందుకు ఆత్మహత్యకు ప్రయత్నిస్తానని కూడా ఆమె బెదిరించిందని తెలిపారు. ఈ వరుస ఘటనలతో చాలా రోజులుగా భార్య వల్ల మానసిక, శారీరక వేధింపులు ఎదుర్కొంటున్నానని ధనుష్ రాజ్ కంప్లైంట్ ఇచ్చారు. బెదిరింపులు తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ధనుష్ రాజ్ ఫిర్యాదు అందినట్లు గిరినగర్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications