బెంగళూరు ఆర్ఆర్ నగర్ ఎన్నికలు: 50 శాతం ఓటింగ్, నాయుడు అరెస్టు అంటూ ప్రచారం!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్ ) శాసన సభ నియోజక వర్గంలో మే 28వ తేదీ సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి స్థానిక ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆర్ఆర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినా ఓటింగ్ శాతం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.
ఆర్ఆర్ నగర శాసన సభ ఎన్నికల్లో 50 శాతం ఓటింగ్ జరిగింది. స్యాండిల్ వుడ్ హీరో, గోల్డన్ స్టార్ గణేష్, ఆయన భార్య, బీజేపీ నాయకురాలు శిల్పా గణేష్ వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జాలహళ్ళిలోని ఓ అపార్ట్ మెంట్ లో 9 వేలకుపై ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో మే 12వ తేదీన ఆర్ఆర్ నగర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఆర్ఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న నాయుడు సోమవారం ఉదయం నుంచి ఎక్కడా కనపడకపోవడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సోమవారం సాయంత్రం 129వ పోలింగ్ కేంద్రంలో మునిరత్న నాయుడు ప్రత్యక్షం కావడంతో పుకార్లకు తెరపడింది.