పెళ్లి బట్టలతో పోలింగ్ కేంద్రానికి: ఓటు వేసిన సెలెబ్రిటీలు వీరే
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. అయిదు కోట్ల మందికి పైగా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతోన్నారు. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది.
మొత్తం 31 జిల్లాల్లో 5.31 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్త ఓటర్ల సంఖ్య 11.7 లక్షలు. మొత్తం 58,545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2,613 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవాది ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

బీజేపీలో టికెట్ లభించకపోవడం వల్ల చివరి నిమిషంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుబ్లీ-ధార్వాడ నుంచి జగదీష్ షెట్టార్, అథణి నుంచి లక్షణ సవాది పోటీ చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- షిగ్గావ్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య-వరుణ, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్-కనకపుర, జేడీఎస్ అధినేత కుమారస్వామి-చెన్నపట్టణ స్థానాల నుంచి పోటీలో ఉన్నారు.
బీజేపీ తరఫున మంత్రి ఆర్ అశోక.. డీకే శివకుమార్పై పోటీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన సొంత నియోజకవర్గం శికారిపురలో యడియూరప్ప కుమారుడు బీవై విజేంద్ర పోటీ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే- చిత్తాపూర్, కుమారస్వామి కొడుకు, ప్రముఖ నటుడు నిఖిల్ కుమారస్వామి- రామనగర స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగారు.
ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. ముమ్మరంగా సాగుతోంది. తొలి గంటలోనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాండల్వుడ్ హీరోలు రమేష్ అరవింద్, గోల్డెన్ స్టార్ గణేష్, జగ్గేష్, అమూల్య.. ఓటు వేశారు. క్యూలో నిల్చుని వారు ఓటు వేశారు. బెంగళూరులో వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో వారు ఓటు వేశారు.
తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓ నవ వధువు పెళ్లి బట్టలతో పోలింగ్ కేంద్రానికి రావడం ఆకర్షించింది. చిక్మగళూరులోని పోలింగ్ బూత్ నంబర్ 165లో ఆమె ఓటు వేశారు. బెంగళూరు జయనగరలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి ఓటు వేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రావాలంటే ఓటు వేయాల్సిందేనని, ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకోవడం అవివేకంమని నారాయణ మూర్తి అన్నారు. ఆడవాళ్లమైన తామే తెల్లవారు జామున 6 గంటలకే లేచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నామని, ఓటు వేసే విషయంలో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకూడదని సుధామూర్తి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications