కర్నాటకలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు- బీజేపీ వివాదాస్పద నిర్ణయం-లింగాయత్, వొక్కలిగలకు పెంపు..
బెంగళూరు : కర్నాటకలో ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఓబీసీ కోటాలో 2B కింద ముస్లింలకు గతంలో కేటాయించిన 4% రిజర్వేషన్లను రద్దు చేసింది. దీన్ని రెండు ఆధిపత్య వర్గాలైన వీరశైవ-లింగాయత్లు, వొక్కలిగలకు కేటాయించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ప్రవేశాలలో వీరిద్దరికీ రెండుశాతం రిజర్వేషన్లు పెంచింది.
కర్నాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల్లో కొత్తగా రూపొందించిన 2సీ, 2డీ కేటగిరీల కింద వొక్కలిగల కోటా 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ-లింగాయత్ల కోటా 5శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద అమలు చేస్తున్న 10% కోటాలో పోటీ పడాల్సి ఉంటుందని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు.

మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1995లో ఓబీసీ కోటాలో కేటగిరీ 2B కింద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని ఇప్పుడు బీజేపీ సర్కార్ రద్దు చేసింది.
గత డిసెంబర్లో బెలగావిలో జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా వొక్కలిగలు, వీరశైవ-లింగాయత్ల కోసం 2C, 2D కొత్త కేటగిరీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ఆధారంగా ఇప్పుడు కేబినెట్ ఈ రిజర్వేషన్ల మార్పుల నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. లింగాయత్, వొక్కలిగల్ని ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications