ఎమ్మెల్యేగా సీఎం భార్య ప్రమాణస్వీకారం, మంత్రి పదవి వారి ఇష్టం, పదవి కాదు ప్రజాసేవ!
బెంగళూరు: రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో లక్ష ఓట్లకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సతీమణి అనితా కుమారాస్వామి శాసన సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం పెద్దల చేతుల్లో ఉందని అనితా కుమారస్వామి అంటున్నారు.
బుధవారం విధాన సౌధలోని స్పీకర్ చాంబర్ కు అనితా కుమారస్వామి చేరుకున్నారు. అనంతరం అనితా కుమారస్వామితో శాసన సభ్యురాలిగా స్పీకర్ రమేష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అనితా కుమారస్వామి భగవంతుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన అనితా కుమారస్వామి రామనగర ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని అన్నారు. తనను ఎమ్మెల్యేని చేసిన ప్రజలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అనితా కుమారస్వామి చెప్పారు.
మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం పార్టీ నేతలు, ప్రభుత్వం చేతిలో ఉందని, మంత్రి పదవి లేకున్నా ప్రజా సేవ చెయ్యడానికి అవకాశం ఉందని అనితా కుమారస్వామి అన్నారు. గతంలో రామనగరలో పోటీ చేసి విజయం సాధించిన కుమారస్వామి రికార్డును భద్దలుకొట్టిన అనితా కుమారస్వామి 1, 25, 043 ఓట్లు సాధించారు. కర్ణాటక చరిత్రలో మొదటి సారి సీఎం కుమారస్వామి తన భార్య అనితా కుమారస్వామితో కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టి మరో రికార్డు సృష్టించడానికి సిద్దం అవుతున్నారు.