కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ: రాష్ట్రపతిగా మోహన్ భగవత్ ఓకే: కేంద్ర మాజీ మంత్రి
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ భారత రాష్ట్రపతిగా సరైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి సీకే. జాఫర్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి కాంగ్రెస్ అధిష్టానాని
బెంగళూరు: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ భారత రాష్ట్రపతిగా సరైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి సీకే. జాఫర్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి కాంగ్రెస్ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు.
మోహన్ భగవత్ ను రాష్ట్రపతిని చెయ్యాలనే విషయంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మోహన్ భగవత్ దేశభక్తిని ఎవ్వరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఆయనకు భారతదేశం మీద ఉన్న ప్రేమ అందరికీ తెలుసని, ఆయనే రాష్ట్రపతిగా సరైన వ్యక్తి అంటూ కేంద్ర మాజీ మంత్రి సీకే. జాఫర్ షరీఫ్ ప్రధానికి లేఖ రాశారు.
మోహన్ భగవత్ ను రాష్ట్రపతిని చెయ్యాలని శిశసేన పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ భగవత్ ను రాష్ట్రపతి చెయ్యడానికి ప్రయత్నిస్తే తాము మద్దతు ఇవ్వమని, వ్యతిరేకిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు తేల్చి చెప్పారు.
అయితే అదే పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటకలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీకే. జాఫర్ షరీఫ్ కాంగ్రెస్ వ్యతిరేకంగా మోహన్ భగవత్ కు మద్దతు ఇవ్వడంతో కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉలిక్కిపడ్డారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణకు సీకే. జాఫర్ షరీఫ్ సన్నిహితుడు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీరుపై పలు సార్లు సీకే జాఫర్ షరీఫ్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాను రాష్ట్రపతి పదవికి పోటీలో లేనని ఇప్పటికే మోహన్ భగవత్ చెప్పిన విషయం తెలిసిందే.