సిద్ధరామయ్య సీటుకు ఎసరు పడ్డట్టే?- మారిన ఈక్వేషన్లు
Siddaramaiah: కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA scam) కుంభకోణం వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత్రపై విచారణ చేయాలంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. లోకాయుక్తకు ఇచ్చిన ఆదేశాలు కొత్త సమీకరణలకు దారి తీసినట్టయింది.
గవర్నర్ ఆదేశాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగిన సిద్ధరామయ్య..కర్ణాటక హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వద్దే ఆగట్లేదు ఈ వ్యవహారం. అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని రాజేసినట్టయింది. ఇన్ని రోజులూ నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన అసంతృప్తి జ్వాలకు ఆజ్యం పోసినట్టయింది.

కొద్దిరోజులుగా ముడా కుంభకోణం.. కర్ణాటకలో రోజూ వార్తల్లో ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని, ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూ వస్తోన్నాయి. ప్లాట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారనే విమర్శలను ఎదుర్కొంటోన్నారు.
దాదాపుగా 55 కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లను తన భార్య పార్వతి పేరు మీద బదలాయించినట్లు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తోన్నారు. ఈ అంశంపై గతంలో ప్రతిపక్ష బీజేపీ- జనతాదళ్ (సెక్యులర్) నాయకులు పలుమార్లు ఆందోళనలు సైతం చేపట్టారు.
ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యను విచారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపించింది. దీనికి అనుగుణంగా- టీజే అబ్రహం, ప్రదీప్, స్నేహమయి కృష్ణ.. రాజ్భవన్ను ఆశ్రయించారు. సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తును దాఖలు చేసుకున్నారు. ముడా స్కాంకు సంబంధించిన్న కొన్ని కీలక డాక్యుమెంట్లను వాటికి జత చేశారు.
దీనిపై జులై 26వ తేదీన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్.. సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసును జారీ చేశారు. దీనికి వారం రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలను ఇవ్వాలంటటూ ఆదేశించారు. దీన్ని తప్పు పట్టింది కర్ణాటక ప్రభుత్వం. దీనికి స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆగస్టు 1వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. సిద్ధరామయ్య నుంచి సంతృప్తికర వివరణ అందకపోవడంతో విచారణకు ఆదేశించారు గవర్నర్.

దీన్ని సవాల్ చేస్తూ ఆయన ఈ ఉదయం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత స్టే ఇచ్చింది హైకోర్టు. ఇక్కడితో విచారణకు బ్రేక్ పడినప్పటికీ- రాజకీయ ఇబ్బందులను తెచ్చిపెట్టింది సిద్ధరామయ్యకు.
తాను కాబోయే ముఖ్యమంత్రినంటూ కొందరు సీనియర్ నేతలు బాహటంగా చెప్పుకొంటోన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సిద్ధరామయ్యపై ఆగ్రహంగా ఉందని, ఆయనను తొలగించడం ఖాయం అనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై పార్టీ సీనియర్లు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. సిద్ధరామయ్యను మార్చుతారంటూ జరిగే ప్రచారాన్ని వెంటనే అరికట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. తానే కాబోయే ముఖ్యమంత్రినంటూ చెప్పుకొంటోన్న వారిపై పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని కోరారు. ఇలాంటి ప్రచారం పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీకి రాసిన లేఖపై సీనియర్ నాయకులు బీఎల్ శంకర్, వీఎస్ ఉగ్రప్ప, హెచ్ఎం రేవణ్ణ, వీఆర్ సుదర్శ, ఎల్ హనుమంతయ్య, బీఎన్ చంద్రప్ప, ప్రకాశ్ రాథోడ్, పీఆర్ రమేష్, ద్వారకనాథ్ సీఎస్, హెచ్ఎస్ చంద్రంబులి, అమర్నాథన్ హెచ్డీ, ఖలీద్ అహ్మద్, మహబూబ్ బాషా, రాణి సతీష్ సంతకాలు చేశారు.












Click it and Unblock the Notifications