డీకే.. పకడ్బందీ ప్లాన్: 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర: బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతోన్న వేళ
బెంగళూరు: కర్ణాటకలో జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీల వీడియో సీడీ వెలుగులోకి రావడంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారిన వేళ.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ వ్యవహారాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే రమేష్ జార్కిహోళి తన పదవికి రాజీనామా చేశారు. దానిపై అప్పటికప్పుడే అంగీకారాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆమోదం కోసం రాజ్భవన్కు పంపించారు. ఆయన రాజీనామాను గవర్నర్ వజూభాయ్ వాలా ఆమోదించడం లాంఛనప్రాయమే.
Recommended Video
అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలను సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ సమాయాత్తమైంది. జనధ్వని పేరుతో పాదయాత్రను చేపట్టింది. కర్ణాటకలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల మీదగా ఈ పాదయాత్ర సాగేలా ప్లాన్ చేసింది. ఇది ముందే ఖరారు చేసిన కార్యక్రమం అయినప్పటికీ.. దీన్ని ప్రారంభించడానికి ఒక్కరోజు ముందు రమేష్ జార్కిహోళి సెక్స్ వీడియో సీడీ వెలుగులోకి రావడం, ఆ మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం శుభసూచకంగా కాంగ్రెస్ భావిస్తోంది.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన బెళగావి లోక్సభతో పాటు మస్కీ, సిందగీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో రాసలీల సీడీ బయటపడటం, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లడం.. యడియూరప్ప సర్కార్కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలను సృష్టించినట్టయింది. పాదయాత్రను పకడ్బందీగా నిర్వహించడానికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇప్పటికే రూట్ మ్యాప్ను రూపొందించారు. డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో ఈ ఉదయమే ఈ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.













Click it and Unblock the Notifications