బెంగళూరు ట్రాఫిక్ లో సీఎం మమతా బెనర్జీ కారు, నో సెక్యూరిటీ: గవర్నర్ కారణం, డీజీపీ వివరణ!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి బెంగళూరు వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్రాఫిక్ లో చిక్కుకుని చివరికి నడిచి విధాన సౌధ చేరుకుని డీజీపీ నీలమణి రాజు మీద ఆగ్రహం వక్యక్తం చేశారు. అదే సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, హెచ్.డి. కుమారస్వామి ముందు మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ట్రాఫిక్ లో చిక్కుకోవడానికి అసలు కారణం కర్ణాటక గవర్నర్ అని గురువారం వెలుగు చూసింది.

భారీ ట్రాఫిక్ జామ్
కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి దేశంలోని వివిద రాష్ట్రాల నుంచి వీవీఐపీలు బెంగళూరు వచ్చారు. దాదాపు వీవీఐపీలు అందరూ ఒకే సారి విధాన సౌధకు బయలుదేరడంతో ట్రాఫిక్ జామ్ తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
Recommended Video


చాళుక్య సర్కిల్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారు చాళుక్య సర్కిల్ ల్లోకి వచ్చిన సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎంతసేపటికి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ సిగ్నల్ వెయ్యకపోవడంతో మమతా బెనర్జీ ఆగ్రహానికి గురైనారు. కారు దిగిన మమతా బెనర్జీ విధాన సౌధకు నడుచుకుంటూ వెళ్లారు.

సీఎంకు సెక్యూరిటీ లేదు
ట్రాఫిక్ సిగ్నల్ నుంచి విధాన సౌధ వరకు నడిచి వస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పోలీసు భద్రత లేకుండాపోయింది. నేరుగా కుమారస్వామి ప్రమాణస్వీకం చేస్తున్న వేదిక మీదకు వెళ్లిన మమతా బెనర్జీ అందరి ముందు డీజీపీ నీలమణి రాజు మీద మండిపడ్డారు. ఒక రాష్ట్ర సీఎం పట్ల మీరు నడుచుకునే తీరు ఇదేనా అని మమతా బెనర్జీ డీజీపీ నీలమణి రాజును నిలదీశారు.

కుమారస్వామి సీరియస్
ప్రమాణస్వీకారం చెయ్యకముందే దేవేగౌడ, కుమారస్వామి ముందు మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చెయ్యడంతో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ విషయంపై సీఎం కుమారస్వామి సీరియస్ అయ్యారు. వివరణ ఇవ్వాలని డీజీపీ నీలమణి రాజుకు సీఎం కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు.

గవర్నర్ కారణం
బెంగళూరులోని జేపీ నగర్ లోని సీఎం కుమారస్వామి ఇంటికి గురువారం వెళ్లిన డీజీపీ నీలమణి రాజు వివరణ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే సమయంలోనే గవర్నర్ వాజుబాయ్ వాలా విధాన సౌధకు బయలుదేరారని, గవర్నర్ వాహనానికి ఫ్రీ సిగ్నల్స్ చెయ్యడం వలన ట్రాఫిక్ జామ్ అయ్యిందని డీజీపీ నీలమణి రాజు సీఎం కుమారస్వామి ముందు వివరణ ఇచ్చారు.

మాజీ ప్రధాని అసహనం
బుధవారం జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే భద్రతా లోపాలు ఉన్న విషయం స్పష్టంగా కనపడుతోందని సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ డీజీపీ నీలమణి రాజు ముందు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.
వీవీఐపీలు అందరూ ఒకే సారి వస్తే మేము భద్రత ఎలా కల్పించాలని, ఫ్రీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా వెయ్యాలని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications