ఆ జాబితా నుంచి పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఔట్..వ్యూహాత్మకంగానే తప్పించారా..?
బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తమ స్టార్ క్యాంపెయనర్ల జాబితాను విడుదల చేయగా... అధికార బీజేపీ పార్టీ సైతం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో పలువురి పేర్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
కర్నాటకలో రాజకీయం రంజుగా మారుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తూ మరింత హీట్ను పెంచుతున్నాయి. ఇక అధికార పార్టీ బీజేపీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్తో పాటు మరో ముగ్గురు సీఎంల పేర్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ జాబితాలో పలు పాపులర్ పేర్లు కూడా మిస్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, ప్రతాప్ సింహ, మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పేర్లు లిస్టులో కనిపించలేదు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు. తేజస్వీ, సింహాలు హిందూత్వ పాలిటిక్స్ ఫైర్బ్రాండ్స్గా గుర్తింపు ఉంది.
మరో ఫైర్ బ్రాండ్ నేత కర్నాటక బీజేపీ చీఫ్ నళిన్ కతీల్ పేరు జాబితాలో కనిపించింది. ఇదిలా ఉంటే తేజస్వీ, సింహాలను జాబితా నుంచి వ్యూహాత్మకంగా తొలగించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంపైనే దృష్టి ఉండేందుకు కమలం పార్టీ పెద్దలు తేజస్వీ, సింహాలను కావాలనే జాబితా నుంచి తప్పించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో కర్నాటక చీఫ్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్ మద్దతుదారులను రాష్ట్రం నుంచి తరిమివేయాల్సిందిగా పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్కు మధ్య జరుగుతున్నవి కాదని, టిప్పు సుల్తాన్-సావర్కర్ల భావజాలాల మధ్య జరుగుతన్న ఎన్నికలంటూ చెప్పి వివాదానికి తెరలేపారు. ఈ క్రమంలోనే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రధాని పాపులారిటీ, అభివృద్ధి పనులపై ప్రచారం చేయాలని బీజేపీ హైకమాండ్ సూచించింది.
ఎంపీ తేజస్వీ సూర్య తన నియోజకవర్గమైన బెంగళూరు సౌత్లో దృష్టి పెట్టాలని కర్నాటక బీజేపీ జనరల్ సెక్రటరీ చెప్పారు.అందుకే సూర్య పేరు జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు.అయితే గతంలో త్రిపురాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్గా తేజస్వీ పనిచేశారు. తేజస్వీ పేరు జాబితాలో కనిపించకపోవడంతో బెంగళూరులోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కింత అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో వైపు యడియూరప్ప తనయుడు విజయేంద్రను తొలగించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బీజేపీ పార్టీ.
ఎన్నికల ప్రచారం ప్రారంభంకు ముందు యువత ఓట్లను బీజేపీ వైపు మరిలేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు విజయేంద్ర. అయితే పార్టీలోని ఓ వర్గం విజయేంద్రను స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తొలగించాలంటూ ఒత్తిడి చేస్తోందని హైకమాండ్ చెప్పినట్లు సమాచారం. కర్నాటకలో మరో యడియూరప్పలా విజయేంద్ర తయారు కాకూడదన్న అభిప్రాయంతో ఆ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే యువతలో అంత పాపులారిటీ ఉన్నప్పటికీ విజయేంద్రను శికారీపురాకే పరిమితం చేసినట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications