వేలల్లో కొత్త కరోనా కేసులు: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
బెంగళూరు: థర్డ్వేవ్లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదివరకటి కంటే ఎన్నో రెట్లు వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. థర్డ్వేవ్ పుట్టుకుని రావడానికి ప్రధాన కారణమైంది. ఒమిక్రాన్ వల్లే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందంటూ నిపుణులు సైతం హెచ్చరించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలను విధించుకుంటోన్నాయి.

రోజువారీ కొత్త కేసులు ఇలా..
మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,68,063 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 277 మంది మరణించారు. 69,959 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,58,75,790కు చేరింది. ఇందులో 3,45,70,131 డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు ఎనిమిది లక్షలను దాటాయి. యాక్టివ్ కేసులు 8,21,446గా రికార్డయ్యాయి. 4,84,213 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు.

కర్ణాటకలో 14 వేలకు పైగా..
థర్డ్వేవ్లో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు మొట్టమొదటిసారిగా నమోదైంది కర్ణాటకలోనే. ఈ నెల ఆరంభం నుంచి కోవిడ్ కొత్త కేసులు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. రోజూ వెయ్యికి తగ్గట్లేదు. కొత్తగా 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో బెంగళూరు వాటా అధికం. 10 వేలకు పైగా కొత్త కేసులు బెంగళూరులో రికార్డయినవే.

ఆంక్షలు మరిన్ని
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం ఇదివరకే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను విధించింది. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగిస్తామని ప్రకటించింది. 9వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులకు పరిమితం చేసింది. కోచింగ్, ట్యూషన్ సెంటర్లను మూసివేసింది. షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్సులు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లల్లో 50 శాతం వరకే అనుమతి ఇచ్చింది. వారాంతపు రోజుల్లో మరింత కఠినంగా కోవిడ్ ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తూ వస్తోంది.

ఐసొలేషన్ నుంచి ముఖ్యమంత్రి..
అయినప్పటికీ.. ఫలితం కనిపించట్లేదు. రోజువారీ కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూను పొడిగించింది. ఈ నెల చివరి వరకూ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఐసొలేషన్లో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్, హోం శాఖ మంత్రి అగర జ్ఞానేంద్ర వర్చువల్ విధానంలో భేటీ అయ్యారు.

బెంగళూరులో 27 కోవిడ్ కేర్ సెంటర్లు..
కోవిడ్ స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, బృహన్ బెంగళూరు మహానగర పాలికె కమిషనర్ గౌరవ్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయించారు. రోజువారీ కరోనా నిర్దారణ పరీక్షలను మరింత పెంచాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బెంగళూరులో తక్షణమే 27 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రోజూ కనీసం లక్షకు పైగా కోవిడ్ టెస్టింగులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ గౌరవ్ గుప్తాను ఆదేశించారు.












Click it and Unblock the Notifications