మాఫీయా డాన్ తో కాంగ్రెస్ మాజీ మంత్రికి లింక్, 38 సిమ్ కార్డులు, రూ. 100 కోట్ల ఆస్తి, బుల్లెట్ !
బెంగళూరు: మాఫియా డాన్ సైకిల్ రవితో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎంబి. పాటిల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే సైకిల్ రవి ఎవరో తనకు తెలీదని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ అంటున్నారు. సైకిల్ రవికి చెందినది అంటున్న ఒక మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి మాజీ మంత్రి ఎంబి. పాటిల్ కు దాదాపు 80 సార్లు ఫోన్లు వెళ్లాయని, వాటి వివరాలు, సీడీఆర్ (ఫోన్ సంబాషణలు రికార్డర్) బెంగళూరు సీసీబీ పోలీసులు సేకరించారని తెలిసింది. మాఫియా డాన్ దగ్గర 38 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఆస్తి రూ. 100 కోట్లకు పైగా ఉందని సమాచారం.
80 సార్లు మంత్రికి ఫోన్
ఎంబి. పాటిల్ బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లో నివాసం ఉంటున్న ఇంటి చిరునామాతో ఓ మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. సైకిల్ రవి దగ్గర స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డు నెంబర్ 97411 99999 నెంబర్ తో 2016 నుంచి ఎంబి. పాటిల్ కు ఫోన్లు చేస్తున్నారని సీడీఆర్ లో రికార్డు అయ్యాయని, వాటిని సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అయితే 97411 99999 నెంబర్ సిమ్ కార్డు సైకిల్ రవి పేరు మీద లేదని, మండ్య జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరు మీద ఉందని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
క్రిమినల్స్ కే క్రిమినల్
సైకిల్ రవి మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. హత్యలు, లూటీలు, కిడ్నాప్ లు, రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్ మెంట్స్ చేస్తున్నాడని సీసీబీ పోలీసులు ఆరోపిస్తున్నారు. చాలకాలం నుంచి తప్పించుకుని తిరుగుతున్న సైకిల్ రవి మీద ఇటీవల సీసీబీ పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. సైకిల్ రవి కాలికి బుల్లెట్ గాయాలైనాయి.
స్యాండిల్ వుడ్ ప్రముఖులు
సైకిల్ రవికి స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇటీవల స్యాండిల్ వుడ్ కామిడి కింగ్, దర్శక నిర్మాత, సంగీత దర్శకుడు అయిన సాధు కోకిలను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. సాధు కోకిలకు, సైకిల్ రవికి సంబంధాలు ఉన్నాయని సీసీబీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 100 కోట్ల ఆస్తులు
అక్రమంగా రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్ మెంట్లు చేసిన సైకిల్ రవి అక్రమంగా రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాధించాడని సీసీబీ పోలీసులు అంటున్నారు. సైకిల్ రవి విషయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం ఇచ్చి ప్రత్యేక టీంతో విచారణ చేయిస్తున్నామని సీసీబీ పోలీసులు అంటున్నారు. బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైకిల్ రవి కోలుకున్న తరువాత అతన్ని విచారించాలని సీసీబీ పోలీసులు సిద్దం అయ్యారు.
38 సిమ్ కార్డులు సీజ్
సైకిల్ రవి మీద కాల్పులు జరిపిన సమయంలో అతని కారులో 38 సిమ్ కార్డులు, 11 మొబైల్ ఫోన్లు ఉండటంతో వాటిని సీసీబీ పోలీసులు సీజ్ చేశారు. 18 సిమ్ కార్డులు బెంగళూరులోని రాజసింగనపాళ్యలోని అడ్రస్ తో, 20 సిమ్ కార్డులు తమిళనాడులోని ఇంటి అడ్రస్ తో సైకిల్ రవి కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కర్ణాటక ఎమ్మెల్యే మానప్ప వజ్జన్ తో సహ సైకిల్ రవికి సంబంధాలు ఉన్నాయని సీసీబీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.