మే 4 తరువాత మద్యం షాపులు ఓపెన్: షాపింగ్ మాల్స్ కూడా..: రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన సర్కార్
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న 19 రోజుల రెండోదశ లాక్డౌన్ ముగిసిన మరుసటి రోజే వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరవడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆదివారం నాటితో రెండోదశ లాక్డౌన్ గడువు ముగియబోతోంది. లాక్డౌన్ను మూడోసారి కూడా పొడిగించడంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి సంకేతాలను కూడా ఇవ్వలేదు. పైగా- భారీగా సడలింపులను ఇచ్చింది.

దశలవారీగా సడలింపులు..
ఈ పరిస్థితుల్లో సోమవారం నుంచి జనజీవనాన్ని పునరుద్ధరించడానికి దశలవారీగా చర్యలను తీసుకోవడానికి బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం సన్నాహాలను ఆరంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరులోని గ్రీన్ జోన్ తరహా ప్రాంతాల్లో దుకాణాలు తెరచుకున్నాయి. బెంగళూరు రూరల్ జిల్లాలో లాక్డౌన్ తరహా వాతావరణంలో సడలింపులను ఇవ్వడం వల్ల ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

మద్యం దుకాణాలు.. షాపింగ్ మాల్స్..
లాక్డౌన్ ముగిసిన తరువాత మరికొన్ని ప్రాంతాలను సడలింపుల జాబితాలోకి తీసుకుని రావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా- మద్యం దుకాణాలు, షాపింగ్ మాల్స్ను కూడా పరిమిత సంఖ్యలో తెరవడానికి అనుమతులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. నాన్ కంటైన్మెంట్ జోన్ల పరిధిలోకి రాని ప్రాంతాల్లో పరిమితంగా మద్యం దుకాణాలు, షాపింగ్ మాల్స్ను ఓపెన్ చేయడానికి అవసరమైన చర్యలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా హాళ్లు.. ప్రజా రవాణాపై మరి కొన్ని రోజుల పాటు..
బెంగళూరులో మాత్రమే కాకుండా.. కర్ణాటక వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కనీసం 75 శాతం మేర పునరుద్ధరించేలా చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుందని అంటున్నారు. సినిమా థియేటర్ల పునరుద్ధరణ, కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీసులపై మరి కొన్ని రోజుల పాటు నిషేధాన్ని కొనసాగించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వ పెద్దలు వ్యక్త చేస్తున్నట్లు సమాచారం.

నాన్ కంటైన్మెంట్ జోన్లలో సాధారణ స్థితులు..
బెంగళూరు అర్బన్ జిల్లాలో ప్రస్తుతం 24 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించింది ప్రభుత్వం. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోకి వచ్చే 34 వార్డులు మాత్రమే ఈ కంటైన్మెంట్ జోన్లల్లో ఉన్నందున.. వాటిల్లో నిషేధాన్ని కొనసాగిస్తూ.. మిగిలిన ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల ప్రభుత్వానికి కొంత మేరకైనా ఆదాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య సోమవారం నుంచి దాదాపుగా బెంగళూరు సహా కర్ణాటక వ్యాప్తంగా గ్రీన్ జోన్లలో జనజీవనం సాధారణ స్థితికి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.












Click it and Unblock the Notifications