ఇకపై టీచర్లు 'Tr' అని రాసుకోవచ్చు.. దేశంలోనే తొలిసారిగా పేర్ల ముందు ప్రెఫిక్స్!
సమాజ నిర్మాణంలో, రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో అహర్నిశం శ్రమించే ఉపాధ్యాయులకు కర్ణాటక ప్రభుత్వం ఒక చారిత్రక బహుమతిని ఇచ్చింది. డాక్టర్లు తమ పేరు ముందు 'Dr' అని, అడ్వకేట్లు 'Adv' అని రాసుకున్నట్లే.. ఇకపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ తమ పేర్ల ముందు 'Tr' (టీచర్ -శిక్షక) అనే అక్షరాలను అధికారికంగా వాడుకోవచ్చని ప్రకటించింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ లోకంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పాఠశాల విద్య శాఖ అండర్ సెక్రటరీ సంతకంతో వెలువడిన ఈ ఉత్తర్వుల్లో ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం ఘనంగా కొనియాడింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో నైతిక విలువలు, నైపుణ్యాలు పెంపొందించడంలోనూ, వారిని క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేసింది. సామాజిక మార్పుకు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులే మూలస్తంభాలని, అందుకే వారి గౌరవాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఏళ్ల నాటి కల నెరవేరిన వేళ..
తమ వృత్తిపరమైన గుర్తింపు కోసం, సమాజంలో మరింత గౌరవాన్ని ఇచ్చేలా పేర్ల ముందు 'Tr' ప్రెఫిక్స్ వాడుకునేందుకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. దాదాపు 4.5 లక్షల మంది కర్ణాటక ఉపాధ్యాయుల ఆకాంక్షను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇది కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదని, ఇతరుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఒక ఉపాధ్యాయుడు చేసే జీవితకాల త్యాగానికి దక్కిన గౌరవమని అధికారులు వ్యాఖ్యానించారు.
అన్ని శాఖలకు సమాచారం.. హర్షం వ్యక్తం చేస్తున్న టీచర్లు
ఈ కొత్త నిబంధనకు సంబంధించి పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇతర విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడే తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటంతో కర్ణాటకలోని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంపొందించేలా మిగతా రాష్ట్రాలు కూడా కర్ణాటక తరహాలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి.














Click it and Unblock the Notifications