మందుబాబులు చచ్చారన్నమాటే: కరోనా ఫీజు: మద్యం రేట్లను భారీగా పెంచిన బీజేపీ సర్కార్
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితులు.. అటు తిరిగి, ఇటు తిరిగి మందుబాబులకు భారంగా పరిణమిస్తున్నాయి. వారి జేబులను గుళ్ల చేయడానికి కారణమౌతున్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మద్యం అమ్మకాలే ఏకైక, తక్షణ దిక్కుగా మారాయి దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు. ఏపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే మద్యం రేట్లను అమాంతం పెంచేయగా.. కర్ణాటక ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. మద్యం అమ్మకాలపై ఇప్పుడున్న అమ్మకం పన్నును 17 శాతం మేర పెంచింది.
మద్యం అమ్మకాలపై 17 శాతం పన్నును పెంచుతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. ఇందులో 11 శాతం మొత్తాన్ని కరోనా ఫీజుగా వసూలు చేస్తామని తెలిపారు. మరో ఆరు శాతం మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తామని అన్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మద్యం రేట్లను పెంచాలని ఇదివరకే బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దానికి అనుగుణంగా ఆరు శాతం రేట్లను పెంచగా.. మిగిలిన 11 శాతం పెంపును కరోనా ఫీజు కింద వసూలు చేస్తామని అన్నారు.
Recommended Video
కరోనా వైరస్ వల్ల విధించాల్సి వచ్చిన లాక్డౌన్ వల్ల సంభవించిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి ఒక్కో రాష్ట్రం.. మద్యంపై అమ్మకపు రేట్లను భారీగా పెంచేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో జగన్ సర్కార్ 75 శాతం, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 70 శాతం మేర మద్యం రేట్లను పెంచాయి. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం 30 శాతం మేరకు లిక్కర్పై సేల్స్ ట్యాక్స్ను పెంచారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అదే బాట పట్టింది. మనదేశంలో తయారయ్యే విదేశీ మద్యంపై 16 శాతం, చీప్ లిక్కర్పై 11 శాతం మేర రేట్లను పెంచాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం 17 శాతం వాటి రేట్లను పెంచింది. మద్యం అమ్మకాల రేట్లను పెంచిన తొలి బీజేపీ ప్రభుత్వం ఇదే.