గోల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు స్వప్నాకు షాక్ ఇచ్చిన హైకోర్టు, ఇలాంటి కేసుల్లో !
బెంగళూరు/కొచ్చి: కేరళలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ను బెదిరించిన క్రిమినల్ కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైయ్యింది. స్వప్న సురేశ్ను బెదిరించాడన్న ఆరోపణలు ఎదురంకొంటున్న విజేష్ పిళ్లైపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన అనుమతిని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.
గతంలో మెజిస్ట్రేట్ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోలేదని, కాబట్టి తాజాగా విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయాలని కర్ణాటక హైకోర్టు బెంచ్ ఆదేశించింది. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ విజేష్ పిళ్లై దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

పిటిషనర్ దాఖలు చేసిన దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఫిర్యాదుదారు స్వప్నా సురేష్ గుర్తించలేని నేరం కోసం మేజిస్ట్రేట్ కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. పోలీసు అధికారి మేజిస్ట్రేట్ ముందు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
అలాగే, నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్ ఆఫీసర్ లేదా ఫిర్యాదుదారు విచారణ కోసం ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందవచ్చు అని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు పెరుగుతున్నా కొందరు న్యాయమూర్తుల నిర్లక్ష్యపు వైఖరి కొనసాగుతోందని, అందుకే అలాంటి ఆదేశాలు ఇస్తున్నారని, కొన్నిసార్లు సరైన కారణం చెప్పకుండా కేవలం ఒక్క మాటలో ఉత్తర్వులు జారీ చేస్తారని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ 2023 మార్చి 11వ తేదీన కేఆర్ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను చంపుతానని విజేష్ పిళ్లై బెదిరించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేరళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చెయ్యకూడదని, వారంలోగా బెంగళూరు వదిలి వెళ్లాలని విజేష్ పిళ్లై తనను బెదిరించారని స్వప్నా సురేష్ ఆరోపించారు.
ఆ నేపథ్యంలో సెక్షన్ 506 కింద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి కేఆర్ పురం పోలీసు అధికారులు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టును అభ్యర్థించారు. దీనికి బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో స్వప్నా సురేష్ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కేఆర్ పురం పోలీసులు కేరళకు చెందిన విజేష్ పిళ్లై మీద క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో దానిని ప్రశ్నిస్తూ విజేష్ పిళ్లై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు, చట్టం ప్రకారం పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మీద ప్రాథమిక సాక్షాలు సేకరించి కోర్టు ముందు సమర్పించాలి. తరువాత నిందితుడి మీద క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది.
అయితే ఈ కేసులో స్వప్న సురేష్ తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తాను బెదిరించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఆరోపణలను, ఆధారాలను పరిశీలించకుండానే మేజిస్ట్రేట్ కోర్టు తన మీద కేసు నమోదు చెయ్యాలని అనుమతించారని, అందుకే ఈ కేసును రద్దు చేయాలని కేరళకు చెందిన విజేష్ పిళ్లై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. విజేష్ పిళ్లై మీద నమోదు చేసిన కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications