ఆ కీలక పిటీషన్పై విచారణ హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ
బెంగళూరు: కర్ణాటకలో హిజబ్ వివాదం ఉగ్రరూపాన్ని దాల్చింది. కళాశాలలు రణరంగంగా మారాయి. ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తొలుత ఉడుపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందళనలు..ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. మండ్య, బాగల్కోటె, శివమొగ్గ, దావణగెరె, యాద్గిర్ వంటి పలు జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఫలితంగా 144 సెక్షన్ను విధించాల్సి వచ్చింది.
ముస్లిం విద్యార్థినులు సంప్రదాయబద్ధమైన హిజబ్ ధరించి కళాశాలలకు రావడాన్ని అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. తొలుత ఉడుపిలో ఎంజీఎం కళాశాలలో ఈ వివాదం ఆరంభమైంది. క్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపించింది. కొందరు విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి తరగతులకు హాజరు కావడం, హిజబ్ వేసుకున్న విద్యార్థినులను అడ్డుకోవడం వంటి పరిణామాలు సంభవించాయి. అనేక జిల్లాల్లోని కళాశాలల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ కర్ణాటక హైకోర్టుపైనే నిలిచింది. ప్రభుత్వం హిజబ్ ధరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. వాటన్నింటినీ హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణకు స్వీకరించింది. జస్టిస్ కృష్ణ దీక్షిత్ సారథ్యంలోని సింగిల్ బెంచ్ సోమవారమే విచారణ ఆరంభించింది. రెండోరోజూ విచారణ కొనసాగింది. ఈ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి విచారణ చేపట్టారు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్.
సీనియర్ అడ్వొకేట్లు దేవ్దత్ కామత్, పూవయ్య, హెగ్డె తమ వాదనలను వినిపించారు. హిజబ్ ధరించి విద్యార్థినులు కళాశాలలకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన ఈ పిటీషన్లపై వాదనలను విన్న తరువాత.. జస్టిస్ కృష్ణ దీక్షిత్ లార్జ్ బెంచ్కు రెఫర్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి సారథ్యాన్ని వహించే బెంచ్ దీనిపై విచారణ చేపట్టొచ్చని అన్నారు. విద్యార్థినులు హిజబ్ ధరించడానికి అనుమతి ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడానికి సింగిల్ బెంచ్ నిరాకరించారు. దీనిపై మరింత విస్తృతంగా వాదనలను ఆలకించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications